Thursday, September 19, 2024

Godavari: టెన్ష‌న్ పెడుతున్న గోదావ‌రి… రెండో హెచ్చ‌రిక జారీ చేసే అవ‌కాశం..

భద్రాద్రి కొత్తగూడెం వద్ద గోదావరికి మరోసారి వరద పోటెత్తింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో సోమవారం నుంచి నీటిమట్టం పెరుగుతూ వస్తున్న గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికను మించి ప్రస్తుతం 45అడుగుల మేర ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 45 అడుగులు దాటిన నేపథ్యంలో అధికారులు తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. మరో మూడు అడుగులు పెరిగి 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక కూడా వెలువడే అవకాశం ఉంది.

కాగా ఇవాళ‌ భద్రాచలం వద్ద 9లక్షల 46 వేల 412 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరికి వరద పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. కాగా.. భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి.

ఈ నేపథ్యంలో అధికారులు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో గోదావరి వరద మరింత పెరుగుతోంది. ఇంద్రావతి, ప్రాణహిత నదుల నుంచి గోదావరిలోకి లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండటంతో అధికారులు నిన్నటి నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు గోదావరిలోకి వదులుతున్నారు.

- Advertisement -

తెలంగాణ-ఛ‌త్తీస్ ఘ‌డ్ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి..

ఎగువన కురిసిన భారీ వర్షాలకు ములుగు జిల్లా వాజేడు మండలం పేరూర్ వద్ద గోదావరి క్రమంగా పెరుగుతుంది. వెంకటాపురం వాజేడు మండలాల్లోని గోదావరి పరివాహక లోతట్టు ప్రాంతాలు పంట పొలాలు జలమయమయ్యాయి. గోదారి ఎగువపోటుతో తెలంగాణ రాష్ట్ర సరిహద్దు టేకులగూడెం వద్ద రేగుమాగు వాగు ఉప్పొంగుతుంది. వరదనీరు 163 జాతీయ రహదారిపై చేరడంతో తెలంగాణ ఛ‌త్తీస్ ఘ‌డ్ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు మండలం ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement