Saturday, September 21, 2024

TG: నిండుగా నీళ్లు.. విద్యుత్ గ‌రిష్ట ఉత్ప‌త్తిని పెంచండి.. ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి

సిబ్బంది 24 X 7 అందుబాటులో ఉండాలి
థ‌ర్మ‌ల్ కేంద్రాల‌లో బొగ్గు నిల్వ‌ల‌పై దృష్టి పెట్టండి
విద్యుత్ ఉత్ప‌త్తిపై ప్ర‌తివారం నివేదిక ఇవ్వండి..
విద్యుత్ స‌మీక్ష స‌మావేశంలో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి ఆదేశం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ : కృష్ణ, గోదావరి పరివాహక ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో నమోదవుతున్న వర్షపాతాలను దృష్టిలో పెట్టుకొని జల విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట ఉత్పత్తిని సాధించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని హైడల్ ప్రాజెక్టుల సీఈలను ఉప ముఖ్య‌మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో థర్మల్, హైడల్ విద్యుత్తు ఉత్పాదనకు సంబంధించిన ఆ శాఖల సీఈలతో ఇవాళ‌ భట్టి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. థర్మల్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రతి ప్లాంట్ లో కనీసం 17రోజుల విద్యుత్ ఉత్పాదనకు సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా మనమంతా నిబద్ధతతో, మనసుపెట్టి పనిచేయాలని, నిర్లక్ష్యానికి, అలసత్వానికి, ఆలస్యానికి తావు లేదని తెలిపారు. విద్యుత్ శాఖలో పనిచేయడం అంటే ప్రజల కోసం నిరంతరం పనిచేయడం. విద్యుత్ శాఖ అంటేనే 24/7 పనిచేసే అత్యవసర శాఖ అని, అన్ని స్థాయిల్లోని అధికారులు, సిబ్బంది గుర్తుపెట్టుకోవాలన్నారు. సమాజానికి వెలుగులు ఇచ్చే శాఖలో పనిచేస్తున్నామని, పూర్తిగా సేవా దృక్పథంతో కూడిన బాధ్యతల్లో ఉన్నామని సిబ్బంది గుర్తించాలని తెలిపారు.

- Advertisement -

ఎవరికైనా సమస్యలు ఉంటే వినేందుకు, వాటిని పరిష్కరించేందుకు 24గంటల పాటు తాను అందుబాటులో ఉంటానని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి, అధికారులు, సిబ్బందికి భరోసా ఇచ్చారు. విద్యుత్ ఉత్పాదనలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు అనుగుణంగా సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని ఆదేశించారు.

సకాలంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల గతంలో శ్రీశైలం, జూరాల వంటి హైడల్ విద్యుత్ ప్రాజెక్టుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం, తద్వారా ఏర్పడిన నష్టాన్ని గుర్తు చేశారు. ఇక ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో అలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదన్నారు. ఇందుకుగాను వారానికి ఒకసారి విద్యుత్ కేంద్రాల పరిస్థితి, ఉత్పాదనకు సంబంధించిన నివేదికలు తనకు పంపాలని ఆదేశించారు. అధికారులకు ఎలాంటి సమస్యలున్నా… వెంటనే విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ప్రాజెక్టులకు సంబంధించి సీఈలు నిర్లక్ష్యం వహించినట్లుగా ఉంటే రాతపూర్వకంగా వారి నుంచి వివరణ తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, జెన్కో డైరెక్టర్లు, సీఈలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement