Sunday, July 7, 2024

TG: తొలిసారి ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్పందించిన తెలంగాణ సర్కార్..

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఇన్నాళ్లూ మీడియాలో వార్తలు రావడం తప్ప ఏనాడూ పెదవి విప్పని తెలంగాణ ప్రభుత్వం తొలిసారి ఈ విషయంలో స్పందించింది. ఈ కేసులో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని, తప్పించుకు తిరుగుతున్న నిందితులు సహా ఒక్కర్ని కూడా వదలబోమని హెచ్చరించింది. ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలను దెబ్బతీసేలా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, దీని ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తంచేసింది.

కేసు దర్యాప్తు విషయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా చట్టానికి లోబడి, సీనియర్ పోలీసు అధికారులు సహా నేరంలో బాధ్యులైన ఏ ఒక్కరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఇప్పటికే చార్జ్‌షీట్ దాఖలు చేశామని, వెలుగులోకి వస్తున్న కొత్త అంశాలపై ఆధారాలు సేకరించేందుకు, తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు ట్రయల్ కోర్టు అనుమతి తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

కాగా, ఈ కేసు తదుపరి విచారణ ఈనెల 23న జరగనుంది. ఈ కేసులో హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం.. ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, హైకోర్టు జడ్జి శరత్ తదితరుల పేర్లు ఉన్నట్టు పేర్కొంది. మరోవైపు, ఇదే కేసుపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని, వివరాలు పరిశీలించాక స్పందిస్తామని కేంద్రం కూడా అఫిడవిట్ దాఖలు చేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement