Wednesday, September 18, 2024

NZB: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని స్థాపించండి…

ఎంపీ అర్వింద్ తో కలిసి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కు
విన్నవించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి
నిజామాబాద్ ప్రతినిధి, ఆగస్టు 1(ప్రభ న్యూస్) : పెండింగ్ లో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని తెలంగాణలో స్థాపించాలని, కేంద్ర జౌళి, టెక్స్ టైల్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ని, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ తో కలిసి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి కోరారు. గురువారం ఢిల్లీలోని మంత్రి కార్యాలయంలో భేటీ అయి చేనేత పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ఇక్కత్ డిజైన్లకు ప్రసిద్ధి అని, మార్కెట్లో అసలు ఇక్కత్ చీరలు రూ.8వేల ధర ఉంటుందని కానీ ప్రింటెడ్ ఇక్కత్ చీరలు కేవలం రూ.300 లకే లభించడంతో, చేనేత కార్మికుల జీవనోపాధి మీద తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు.

మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడానికి నేతన్నలకు భరోసా కల్పించడానికి ప్రింటెడ్ చీరల ఉత్పత్తి, విక్రయాల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధించినప్పటి నుండి నేతన్నలు అదనపు ఆర్థిక భారంతో ఇబ్బంది పడుతున్నారని చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని తొలగించాలని ఆమె కోరారు. అదేవిధంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఇక్కత్ కళకు, గద్వాల్ చీరలకు, వరంగల్ దుర్రీలను ఉత్పత్తి చేసే అసాధారణ కళ తెలంగాణ నేతన్నల సొంతమని, కాబట్టి తెలంగాణలో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆమె కోరారు.

అనంతరం బోగ శ్రావణి పోచంపల్లి శాలువాతో మంత్రికి సన్మానించారు. తెలంగాణ వచ్చినప్పుడు తప్పకుండా పోచంపల్లిని సందర్శిస్తానని, అదేవిధంగా విన్నపాల మీద తగు చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ నేతన్నల తరపు నుండి ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement