Saturday, September 21, 2024

Encounter – ఏటిలో దుంకి ఎవరు చావాలి… మాట తప్పిన మీరా.. నేనా?

ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – రుణమాఫీ హామీపై మాట తప్పినందుకు సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ధ్వజమెత్తారు. తాను ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు ప్రవర్తించలేడనే విషయాన్ని ప్రతి సందర్భంలోనూ రేవంత్‌ రెడ్డి నిరూపించుకుంటున్నాడని విమర్శించారు. వైరా సభలో హరీశ్ రాజీనామాకు రేవంత్ డిమాండ్ చేసిన నేపథ్యం లో హరీశ్ మీడియా తో మాట్లాడుతూ,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గాని, తెలంగాణ చరిత్రలో గాని ఇంతగా దిగజారిన దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరని మండిపడ్డారు. అబద్ధం కూడా సిగ్గుపడి మూసీలో దూకి ఆత్మహత్య చేసుకునేలా సీఎం ప్రవర్తన ఉందని అన్నారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకొని కూడా మాట మీద నిలబడక పోగా, నిస్సిగ్గుగా బీఆర్ఎస్‌పై, తనపై అవాకులు చెవాకులు పేలాడని విమర్శించారు..

అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ పుట్టిన రోజు కానుకగా డిసెంబర్ 9 నాటికి రూ.40వేల కోట్లను రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తానని రేవంత్‌ రెడ్డే అన్నారని హరీశ్‌రావు గుర్తు చేశారు. అది నెరవేర్చలేక పార్లమెంట్ ఎన్నికల ముందు మరో నాటకానికి తెరలేపారని విమర్శించారు. ఆగస్టు 15వ తేదీ వరకు 31వేల కోట్లు మాఫీ చేస్తానని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిండని.. 9వేల కోట్లు కోత పెట్టిండని అన్నారు. అయినప్పటికీ ప్రజలు నమ్మడం లేదని ప్రతి ఊరి దేవుడి మీద ప్రమాణాలు చేసిండని ఎద్దేవా చేశారు

.సోనియా మీద ఒట్టు పెట్టినా, దేవుళ్ల మీద ఒట్టు పెట్టినా అబద్దమే నా లక్షణం. మోసమే నా విధానం. మాట తప్పడమే నా నైజం అనే విధంగా తన నిజస్వరూపాన్ని రేవంత్‌ రెడ్డి బట్టబయలు చేసుకున్నారని విమర్శించారు. తమ హయాంలో మొదటి దఫాలో రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తేనే 35లక్షల మంది రైతులకు దాదాపు 17వేల కోట్లు అయ్యిందని గుర్తుచేశారు.

- Advertisement -

కాంగ్రెస్‌ ప్రభుత్వం నిజంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులు ఉంటారా? రూ.17,869 కోట్లు మాత్రమే అవుతుందా? అని ప్రశ్నించారు. ఈ ఒక్క విషయంతోనే రుణమాఫీ పచ్చి అబద్ధమని తేలిపోతుందని విమర్శించారు. మీరు దగా చేశారన్నది స్పష్టంగా తేలిపోయిన తర్వాత రాజీనామా ఎవరు చేయాలని ప్రశ్నించారు. ఏటిలో దుంకి ఎవరు చావాలని నిలదీశారు. నోటికి వచ్చినట్టు దిగజారుడు భాషలో బీఆర్‌ఎస్‌ను తిడితేనో, తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో రంకెలు వేస్తేనో అబద్ధాలు నిజాలైపోవని మండిపడ్డారు.

రేవంత్‌ రెడ్డి రైతు ద్రోహానికి మాత్రమే కాదు.. దైవ ద్రోహానికి పాల్పడ్డావని హరీశ్‌రావు మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పిన నువ్వు.. చేసిన అపచారానికి వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలని హితవు పలికారు. రేవంత్‌ రెడ్డికి సంస్కారం లేదని.. ఆయనలో ఉన్నది వికారమే తప్ప సంస్కారమే కాదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట తెప్పినందుకు ఆ దేవుళ్లు తెలంగాణ మీద ఎక్కడ ఆగ్రహిస్తారో.. రేవంత్‌ చేసిన పాప ఫలితం ప్రజలకు ఎక్కడ శాపంగా మారుతుందో అని ఆందోళన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి చేసిన తప్పునకు, దైవ ద్రోహానికి తెలంగాణ మీద ఆగ్రహించవద్దని ముక్కోటి దేవుళ్లను ప్రార్థించారు. ఆయన ఏ దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పిండో ఆ దేవుళ్లందరి దగ్గరికీ త్వరలో తానే స్వయంగా వె ళ్తానని చెప్పారు. రేవంత్ రెడ్డి చేసిన తప్పు తెలంగాణ ప్రజలకు ముప్పుగా మారొద్దని ఆ దేవుళ్లను ప్రార్థించి వస్తానని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement