Friday, September 20, 2024

Duseehra – సింగ‌రేణి కార్మికుల‌కు బోన‌స్ ప్ర‌క‌టించిన రేవంత్ … ఒక్కొక్క‌రికి ఎంతంటే ..

హైద‌రాబాద్ – సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ బోనస్ ప్రకటించారు.. ప్రతి కార్మికుడికి లక్షా 90 వేల రూపాయలు బోనస్ ఇస్తున్నామని, అంటే గతేడాది కంటే 20 వేలు అధికంగా అంది కార్మికులకు దసరా బోనస్‌ను ముందుగానే ప్రకటిస్తున్నామని వెల్ల‌డించారు.

దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు తీపి కబురు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24) సింగరేణి సాధించిన 4701 కోట్ల రూపాయల లాభాలలో సంస్థ వ్యాపార విస్తరణ ప్రణాళికల కోసం రూ.2,289 కోట్ల కేటాయించగా.. మిగిలిన 2412 కోట్ల రూపాయలపై 33 శాతాన్ని లాభాల వాటా బోనస్ గా కార్మికులకు చెల్లించనున్నట్లు సిఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రకటించారు.

- Advertisement -

రాష్ట్ర మంత్రిమండలి సభ్యులతో కలిసి నేడు సచివాలయంలో లాభాల బోనస్ను ప్రకటించారు. 33 శాతం వాటా కింద రూ.796 కోట్లను కార్మికులకు లాభాల వాటా గా చెల్లిస్తుండగా ఒక్కొక్క కార్మికుడు సగటున రూ. 1,90,000 వరకు అందుకోనున్నాడు. సింగరేణి చరిత్రలో ఇదే అత్యధిక లాభాల వాటా బోనస్ గా నిలువ నుంది. అలాగే సింగరేణి చరిత్రలో తొలిసారిగా సంస్థ లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కూడా లాభాల బోనస్ ను వర్తింపజేస్తున్నట్లు తెలిపారు.

గతం కన్నా 85 కోట్లు అధికం.. 2022 -23 ఆర్థిక సంవత్సరంలో లాభాల వాటా కింద ప్రకటించిన 32 శాతం తో రూ.711 కోట్లను కార్మికులకు పంపిణీ చేయగా ఇప్పుడు 33%తో రూ.796 కోట్లు పంపిణీ చేస్తున్నారు. ఇది అప్పటి కన్నా 85 కోట్లు అధికం. అప్పుడు కార్మికులు సగటున ఒక లక్ష 70 వేల రూపాయలు లాభాల బోనస్ గా అందుకోగా ఇప్పుడు సగటున ఒక లక్ష 90 వేల రూపాయలు అందుకోబోతున్నారు.

గత ఆర్థిక సంవత్సరం సంస్థలో అత్యధికంగా 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా జరపడంతో ఎప్పుడూ లేనంతగా రూ.4701 కోట్ల నికర లాభాలను కంపెనీ ఆర్జించింది.నాడు లాభాల బోనస్ రూ.2782… నేడు దాదాపు 2 లక్షలు 1990 దశకంలో తీవ్ర నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను కార్మికులు, అధికారులు సమష్టిగా కృషి చేసి లాభాల బాట పట్టించారు.

. ఈ నేపథ్యంలో కార్మికులకు లాభాల్లో వాటా ఇచ్చి ప్రోత్సహించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. 1999 -2000 సంవత్సరం లో తొలిసారిగా నాడు వచ్చిన 300 కోట్ల రూపాయల లాభాల్లో 10% అనగా 30 కోట్లను లాభాల వాటా బోనస్ గా ప్రకటించారు. నాడు కంపెనీలోఉన్న ఒక లక్ష 8 వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి సగటున 2,782 రూపాయలను లాభాల వాటాగా పంపిణీ చేశారు.

ఈ సాంప్రదాయం దేశంలోని ఏ ప్రభుత్వ రంగ సంస్థలోనూ లేదు.. నాటి నుంచి సింగరేణి సంస్థ వరుసగా లాభాలు సాధిస్తూ దేశంలోనే అగ్రస్థాయి సంస్థగా నిలుస్తూ వస్తోంది. దీనితో లాభాల వాటా బోనస్ను ప్రతీ ఏడాది పెంచుతూ కార్మికులకు పంపిణీ చేస్తున్నారు. 2013-24లో లాభాల బోనస్ 20 శాతాని కి పెరిగింది. అప్పుడు సగటున కార్మికుడు 13,751 రూపాయలు లాభాల వాట బోనస్ గా స్వీకరించాడు. 2021- 22 నాటికి ఇది 30 శాతానికి చేరుకోగా సగటున కార్మికుడికి సుమారు 90 వేల రూపాయల వరకు లాభాల వాటా అందింది.

ఈ ఏడాది సింగరేణి చరిత్ర లోనే అత్యధికంగా 33 శాతం లాభాల వాటా బోనస్ గా ప్రకటించడం వలన మస్టర్లు అధికంగా ఉన్న కార్మికులు 2.5 లక్షలకు పైగా బోనస్ అందుకునే అవకాశం ఉంది. అయితే సగటున మాత్రం 1,90,000 రూపాయలను కార్మికులు అందుకోనున్నారు.

.తొలిసారిగా పొరుగు సేవల సిబ్బందికి కూడా బోనస్… సింగరేణి కాలరీస్ చరిత్రలో తొలిసారిగా ఈ ఏడాది పొరుగు సేవల కింద పని చేస్తున్న కాంట్రాక్టు, ఒప్పంద కార్మికుల కూడా లాభాల బోనస్ను చెల్లించాలని నిర్ణయించినట్లు v భట్టి విక్రమార్క మల్లు ప్రకటించారు.. కంపెనీ లో 25 వేల మంది వరకు కాంట్రాక్టు, పొరుగు సేవల సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో గత ఆర్థిక సంవత్సరంలో నిర్ణీత మస్టర్లు పూర్తి చేసిన వారికి నిబంధనల ప్రకారం బోనస్ను చెల్లించనున్నారు. సగటున రూ.5 వేల వరకు లాభాల బోనస్ను కాంట్రాక్టు కార్మికులు పొందే అవకాశం ఉంది.

బహుముఖ వ్యాపార విస్తరణ…

ఈ ఏడాది వచ్చిన 4701 కోట్ల రూపాయల లాభాలలో 2289 కోట్ల రూపాయాలను కంపెనీ విస్తరణ , అభివృద్ధి పనుల కోసం కేటాయిస్తున్నట్లు భట్టి తెలిపారు. కంపెనీ ఆర్థిక సుస్థిరత, భవిష్యత్ కోసం రాష్ట్ర ప్రభుత్వ మార్గ నిర్దేశంలో బహుముఖ వ్యాపార విస్తరణ చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారు.. ఇందులో భాగంగా సోలార్ విద్యుత్ను 1,000 మెగావాట్లకు పెంచాలని, రామగుండంలో 500 మెగావాట్ల పంప్డుడ్ స్టోరేజీ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని, ప్రస్తుత 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో మరో 800 మెగావాట్ల సామర్థ్యం కల సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, రామగుండంలో తెలంగాణ జెన్కో భాగస్వామ్యంలో 800 మెగావాట్ల ప్లాంట్ను ,ఒడిశాలో 2400 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, దీనికి సంబంధించి ప్రణాళికలను రూపొందించి ముందుకెళ్తున్నట్లు తెలిపారు.

.సింగరేణి సంస్థలో వీకే ఓసీ, గోలేటి ఓసీ, నైనీ ఓసీలను ఈ ఏడాది ప్రారంభించనున్నట్లు, తద్వారా ఏడాది ఉత్పత్తి లక్ష్యం 72 మిలియన్ టన్నులకు చేరుకోనుందన్నారు. అలాగే నూతన సీహెచ్పీల నిర్మాణం, కార్మికుల సౌకర్యార్థం క్వార్టర్లు, కార్మికుల పిల్లల కోసం సింగరేణి పాఠశాల ఆధునికీకరణ, రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు, ఏరియా ఆసుపత్రుల ఆధునికీకరణ, క్యాథ్ ల్యాబ్ల ఏర్పాటు, క్యాంటీన్ల ఆధునికీకరణ, హైదరాబాద్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ వ్యాపార విస్తరణ చర్యలతో కంపెనీకి ఉజ్వల భవిష్యత్ ఉందని, కాబట్టి కార్మికులు, అధికారులు సమర్థంగా పనిచేస్తూ రక్షణ, నాణ్యతతో కూడిన ఉత్పత్తికి కృషి చేసి సంస్థను ఆదర్శవంతమైన కంపెనీగా తీర్చిదిద్దాలని కోరారు.

ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, గడ్డం వినోద్, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ప్రేంసాగర్ రావు, ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రాతినిధ్య సంఘ నాయకులు జనక్ ప్రసాద్, అధికారుల సంఘం నాయకులు లక్ష్మీ పతి గౌడ్, జీఎంలు సుభానీ, రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి కార్మికులకు లాభాల వాటా ను ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కి, ఉప ముఖ్యమంత్రి కి కార్మికుల తరఫున సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణి సంస్థలో గల 41,500 మంది కార్మికులు, అధికారులకు ఈ బోనస్ ను దసరా పండుగకు ముందు చెల్లించేందు ఏర్పాట్లు చేయాలని ఆయన సిబ్బంది, ఆర్థిక శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ..

Advertisement

తాజా వార్తలు

Advertisement