Friday, September 13, 2024

TG: ప్రభుత్వ ఉద్యోగులు విరాళం ఇవ్వడం అభినందనీయం.. ష‌బ్బీర్ అలీ

నిజామాబాద్ ప్రతినిధి, సెప్టెంబర్ 4 (ప్రభ న్యూస్): తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడానికి జిల్లా ఉద్యోగులు ఒకరోజు వేతనం అందజేయడం అభినందనీయమని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. బుధవారం నిజామాబాద్ నగరంలోని ఆర్ఐఎంబి అతిథి గృహంలో నిజామాబాద్ జిల్లా ఉద్యోగుల జేఏసీతో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ సమావేశమయ్యారు. నిజామాబాద్ జిల్లా ఉద్యోగుల ఒకరోజు వేతనం సుమారు రూ.5కోట్ల వరద బాధితులకు అంద జేశారు. అనంతరం ఉద్యోగులు తమ సమస్యలను షబ్బీర్ అలీకి విన్నవించుకున్నారు. షబ్బీర్ అలీ సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మీ న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించే విధంగా చూస్తానన్నారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నా రు. పలువురు సీఎం సహాయనిధికి విరాళాలు అందించేందుకు ముందుకు వస్తున్నారన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తూ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులంతా ఉదారత చాటుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. వరద బాధితుల కోసం రాష్ట్ర ఉద్యోగులంతా కలిసి తమ ఒకరోజు మూల వేతనం రూ.130 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారన్నారు.

నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నాయకులు త‌మతో కలిసి సంతకాలతో కూడిన అంగీకార పత్రాన్ని అందజేశారు. వారికి ధన్యవాదాలు తెలిపారు. వరద బాధితుల కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఒకరోజు మూల వేతనాన్ని అందించడం వారి మానవత్వానికి ఒక ప్రతీక అన్నారు. మనస్పూర్తిగా వారిని అభినందిస్తున్నానని చెప్పారు. త్వరలోనే ఉద్యోగ సంఘాలతో సచివాలయంలో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి సమావేశ మవుతారని తెలిపారు. తెలంగాణ ప్రజలు విపత్తులో ఉన్న సమయంలో ఉద్యోగులంతా కలిసి సీఎం సహాయ నిధికి విరాళం ఇవ్వడం గొప్ప విషయమని షబ్బీర్ అలీ ప్రశంసించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement