Friday, September 20, 2024

TG: పెండింగ్ పాల బిల్లులు చెల్లించాలంటూ.. పాడి రైతుల ధర్నా..

స్టేషన్ ఘన్ పూర్ లో పాల డబ్బాలతో రాస్తారోకో..
కిలోమీటర్ మేర స్తంభించిన ట్రాఫిక్..
పాడి రైతులను ప్రభుత్వం పట్టించుకుంటలేదు..
సీఎం దృష్టికి రెండుసార్లు తీసుకెళ్లిన సమస్య పరిష్కారం కాలేదు…
బిల్లులు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం: పాడి రైతులు
స్టేషన్ ఘన్ పూర్ : జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై విజయ డైరీలో పాలు పోస్తున్న రైతులు, తమకు రావాల్సిన‌ ఐదు విడతల బిల్లులు చెల్లించడం లేదంటూ శుక్రవారం పాడి రైతులు ఆందోళన చేశారు… విజయ డైరీ ఎండీకి మొరపెట్టుకున్నా ఏం చేసుకుంటారో చేసుకోండి.. ఎక్కడికి వెళ్తారో అంటూ తలా తోక లేని సమాధానం చెప్పారని మండిపడ్డారు. పాల బిల్లులు చెల్లించడం లేదని పలుమార్లు ఎమ్మెల్యేలకు, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పశు సంవర్థక శాఖను తన వద్ద ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి రెండుసార్లు తీసుకెళ్లినా సమస్య తీర లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాడి రైతుల పిలుపుమేరకు జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. ఇదేమి రైతు సంక్షేమ ప్రభుత్వమని విమర్శించారు. బిల్లులు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ఆందోళనలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో సాదం రమేష్, వడ్లురి వేంకటాద్రి, గోడిశాల వెంకటయ్య, జి.కుమార్, కాసాని నాగరాజు, కత్తుల రాజు, చొక్కం రాములు, పండుగ రవి, మునిగాల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement