Friday, September 20, 2024

ADB: త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్

నిర్మల్ ప్రతినిధి, సెప్టెంబర్ 17 (ప్రభ న్యూస్) : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఇవాళ‌ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు  అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన ఛైర్మన్ రాజయ్య, పుర ప్రముఖులకు, అధికార అనధికారులకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

జిల్లా ప్రగతిని, సెప్టెంబర్ 17 ప్రాముఖ్యతను వివరిస్తూ, జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నాటి రాచరిక పాలన నుంచి తెలంగాణ ప్రాంతం విముక్తి కోసం జరిగిన పోరాటాలను గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలు వివరిస్తూ, అభయహస్తం ఆరు గ్యారెంటీల ద్వారా జిల్లా ప్రజలకు చేకూరిన లబ్ది వివరాలను వివరించారు. జిల్లా అభివృద్ధి కోసం అధికారులు మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలల విద్యార్థులచే తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు ముఖ్య అతిథి, కలెక్టర్ల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.అంతకు ముందు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. 

- Advertisement -

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్ లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్ లతో కలిసి చైర్మన్ రాజయ్య అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం విద్యా శాఖ ఆధ్వర్యంలో బాలశక్తి కార్యక్రమ పోస్టర్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ లతో కలిసి చైర్మన్ రాజయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, కళాకారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement