Monday, October 7, 2024

Basara – స్కందమాతగా జ్ఞాన స‌ర‌స్వ‌తి…

బాస‌ర‌లో కొన‌సాగుతున్న‌ శార‌దీ న‌వ‌వ‌రాత్రి ఉత్స‌వాలు
9న మూల న‌క్ష‌త్రం పుర‌స్క‌రించుకుని ప్ర‌త్యేక ఏర్పాట్లు
బాస‌ర‌లో రేపు అక్ష‌రాభ్యాస కార్య‌క్ర‌మాలు
రూ.150ల‌తో అక్ష‌రాభ్యాసం పూజ‌
ఆల‌య అతిథి గృహాల నుంచి ప్ర‌త్యేక క్యూలైన్‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, బాసర : దేశంలో ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రాల్లో బాస‌ర శ్రీ జ్ఞాన స‌ర‌స్వ‌తీ దేవీ అమ్మ‌వారి ఆల‌యం ఒక‌టి. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారి సన్నిధిలో శార‌దీ నవరాత్రి ఉత్సవాలు వైభ‌వంగానిర్వ‌హిస్తున్నారు. ఈ ఉత్స‌వాలు సోమవారం ఐదో రోజుకు చేరుకున్నాయి. తెల్ల‌వారు జాము ఐదు గంట‌ల నుంచి అమ్మ‌వార్ల ద‌ర్శ‌నానికి భ‌క్తులు బారులు తీరారు.

- Advertisement -

స్కంద‌మాతగా అమ్మ‌వారు భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం
అమ్మవారు స్కంద మాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి అర్చకులు విశేష అర్చన నిర్వహించి పెరుగు అన్నం నైవేద్యంగా సమర్పించారు. వేకువ జామున 5 గంటల నుండి అమ్మవార్ల దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి నది తీరాన గల శివాలయంలో అభిషేక అర్చన పూజలు చేశారు. అనంతరం భక్తులు తమ చిన్నారులకు ఆలయంలోని అక్ష‌రాభ్యాస మండపంలో అక్షరాబ్యాస పూజలు జరిపించి ఆలయంలో కొలువుదీరిన అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

9న ప్ర‌త్యేక అక్ష‌రాభ్యాస కార్య‌క్ర‌మాలు
దక్షిణ భారతదేశంలోని ఏకైక చదువుల తల్లి కొలువైన బాసర క్షేత్రంలో మూల న‌క్ష‌త్రం పుర‌స్క‌రించుకుని వివిధ ప్రాంతాల నుంచి భ‌క్తులు ఇక్క‌డ‌కు వ‌చ్చిఅక్ష‌ర‌భ్యాసాలు చేయిస్తుంటారు. శార‌దీయ న‌వ‌రాత్రి ఉత్స‌వాలు సంద‌ర్భంగా ఈ నెల 9న మూల న‌క్ష‌త్రం ప‌డ‌డంతో ప్ర‌త్యేక అక్ష‌రభ్యాస కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డానికి ఆల‌య అధికారులు ఏర్పాట్లు చేశారు. మంగళవారం అర్ధరాత్రి మూల న‌క్ష‌త్రం వ‌స్తుంద‌ని, రెండు గంటల నుండి ఆలయంలో అక్షరాభ్యాస పూజలను ప్రారంభించ‌నున్న‌ట్లు ఆల‌య ఈఓ విజ‌య‌రామారావు తెలిపారు.

అక్ష‌రాభ్యాసం టికెట్ ధ‌ర రూ.150, రూ.1000

అమ్మవారి సన్నిధిలో సాధారణంగా అక్ష‌రాభ్యాసం టికెట్ 150 రూపాయలు, రూ.1000లుగా నిర్ణ‌యించిన‌ట్లు ఆల‌య అధికారులు తెలిపారు. అక్ష‌రాభ్యాస పూజలకు, సర్వదర్శననికి వేరు వేరుగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అలాగే ఆన్లైన్ టికెట్ల ప్రత్యేక అక్షరాభ్యాస క్యూలైన్లు, 100 రూపాయల ప్ర‌త్యేక‌ దర్శనానికి క్యూ లైన్ ఆలయ అతిథి గృహాల వద్ద నుండి ఏర్పాటు చేసినట్లు ఆల‌య అధికారులు చెప్పారు.

భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఏర్పాట్లు
ఈ నెల 9న అధిక సంఖ్య‌లో భ‌క్తులు వ‌స్తార‌ని, భ‌క్తులు ఎలాంటి ఇబ్బందులు ప‌డ‌కుండా ఏర్పాట్లు చేస్తున్నామ‌ని ఆల‌య ఈఓ విజ‌య‌రామారావు తెలిపారు. అక్షరాభ్యాస పూజలు సర్వదర్శనాల క్యూ లైన్ లో భక్తులకు పాలు, నీరు అందుబాటులో ఉంచుతున్నామ‌ని చెప్పారు. రెండు బయో టాయిలెట్లను నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ ఏర్పాట్లు చేస్తున్నార‌న్నారు. గోదావరి నది తీరాన అందుబాటులో 40 మంది గజ ఈతగాళ్లు ఉంచినట్లు తెలిపారు. ఆలయానికి వచ్చే వాహనాలకు మూడు చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేవి నవరాత్రి ఉత్సవాలలో అమ్మవార్లకు మూలా నక్షత్రం సందర్భంగా దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్న‌ట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement