Friday, October 18, 2024

Aswraopet ‘ పెద్దవాగు’ నిర్వాసితులందరినీ ఆదుకుంటాం – మంత్రి పొంగులేటి

  • ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ గృహాలు కట్టిస్తాం
  • ఇసుక మేట వేసిన 400 ఎకరాల రైతులకు పరిహారమిస్తాం
  • నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు నోటీసులిచ్చాం
  • ప్రాజెక్ట్ మరమ్మతులకు తక్షణ సాయం రూ.8కోట్ల కేటాయింపు
  • రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  • పెద్దవాగు ప్రాజెక్ట్ గండి పరిశీలన
  • 51 మంది ముంపు నిర్వాసితుల ఇళ్లకు వెళ్లి పీఎస్ఆర్ ట్రస్టు ద్వారా ఆర్థిక సాయం

అశ్వారావుపేట: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ నెల 18వ తేదీన వరద ఉప్పొంగి గుమ్మడపల్లి గ్రామం వద్ద పెద్దవాగు ప్రాజెక్టు గండి పడి కట్ట తెగిన ప్రాంతాన్ని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం పరిశీలించారు. కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో కలిసి ధ్వంసమైన ప్రాజెక్ట్ ప్రదేశంలో కలియతిరిగి చూసి ప్రాజెక్ట్ కు ఇంతటి గండి పడటం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానిక అధికారుల ద్వారా పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కోయరంగాపురం, గుమ్మడవల్లి, కొత్తూరు గ్రామాల్లో 51 మంది వరద ముంపు నిర్వాసితుల ఇళ్లకు మంత్రి పొంగులేటి స్వయంగా వెళ్లి పీఎస్ఆర్ ట్రస్టు ద్వారా ఆర్థిక సాయం అందజేశారు. కొత్తూరు గ్రామంలో విద్యుత్ ప్రమాదంలో మరణించిన శివ కుటుంబాన్ని పరామర్శించి, ఆర్ధిక సాయం అందజేశారు. ఆయా ప్రాంతాల్లో నిర్వాసితులను ఓదారుస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. కోయరంగాపురం గ్రామంలో విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడారు.

- Advertisement -

ఆ వివరాలు ఇలా..
ఎకరానికి రూ.10వేలు..
నష్టం జరిగిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అదుకుంటుందని మంత్రి అన్నారు. 400 ఎకరాలు ఇసుక మేటతో పూడుకుపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఎకరాకు రూ. 10 వేల చొప్పున తొలగింపు కోసం ఇస్తామని ప్రకటించారు. పత్తి, వరి పంటలు నష్టపోయిన రైతులకు విత్తనాలు ఉచితంగా ఇస్తామని తెలిపారు. వరదలో కొట్టుకుపోయిన ఒక్కో గొర్రె యజమానికి రూ.3వేలు, ఆవులు, గేదెలకు సంబంధించి యజమానికి రూ. 20,000వేలను ప్రభుత్వం ఇవ్వనుందని తెలిపారు. వరద వల్ల నీట మునిగి ఇళ్లను కోల్పోయిన వారందరికీ ఇందిరమ్మ గృహాలు మంజూరు చేస్తామని మంత్రి అభయమిచ్చారు.

అధికారులకు నోటీసులిచ్చాం..

ప్రాజెక్టు మూడు గేట్లతో 40 వేల క్యూసెక్యుల వరద విడుదల అవుతుందని, 70 వేల క్యూసెక్యులు వచ్చినప్పుడు అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రాజెక్ట్ గండి పడిందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. సరైన సమయానికి గేట్లు ఎత్తి ఉంటే ఇంతటి ముప్పు జరిగేది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులైన అధికారులకు ఇప్పటికే షోకాజు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రితో మాట్లాడి తక్షణ మరమ్మతుల కోసం రూ.8 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు.

భూ కబ్జాలపై సర్వే చేయాలని కలెక్టర్ కు ఆదేశం
పెద్దవాగు ప్రాజెక్ట్ భూములను కొందరు కబ్జా చేశారని స్థానిక రైతులు ఆరోపించగా మంత్రి పొంగులేటి వెంటనే స్పందించారు. వర్షాలు తగ్గాక పూర్తిస్థాయిలో సర్వే చేయించాలని కలెక్టర్ ను ఆదేశించారు.

ఆంధ్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన పొంగులేటి..
41 మంది రైతు కూలీలను రక్షించేందుకు వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడామని, హెలికాప్టర్ సహాయంతో వారిని కాపాడారని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ సర్కారుకు తెలంగాణ ప్రభుత్వo తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement