Friday, September 20, 2024

Assembly – బడ్జెట్‌ బిల్లుపై వాడీవేడి చ‌ర్చ – కాంగ్రెస్, బిఆర్ఎస్ నేత‌ల మధ్య వార్

బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి
కాంగ్రెస్‌పై కేటీఆర్ విమ‌ర్శ‌ల వ‌ర్షం
కేటీఆర్ విమ‌ర్శ‌ల‌కు మంత్రుల కౌంట‌ర్లు
విమ‌ర్శ‌లు.. ప్ర‌తి విమ‌ర్శ‌ల‌తో ద‌ద్ద‌రిల్లిన అసెంబ్లీ

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : అసెంబ్లీ బ‌డ్జెట్‌ స‌మావేశాలు వాడీవేడిగా జ‌రుగుతున్నాయి. బుధ‌వారం ద్రవ్యవినిమయ (బ‌డ్జెట్‌) బిల్లుపై చ‌ర్చల‌తో అసెంబ్లీ ద‌ద్ద‌రిల్లింది. బిల్లును ఉప ముఖ్య‌మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌వేశ‌పెట్టారు. దీనిపై ఆస‌క్త‌క‌రంగా చ‌ర్చ ప్రారంభ‌మైంది. చ‌ర్చ‌లో భాగంగా బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌లతో దాడి చేశారు. దీనికు మంత్రులు దీటుగా కౌంట‌ర్లు ఇచ్చారు.

- Advertisement -

అప్పులపై త‌ప్పుడు ప్ర‌చారం.. ఇలా అయితే పెట్టుబడులు రావు: కేటీఆర్‌
అప్పులపై త‌ప్పుడు ప్ర‌చారం చేయొద్ద‌ని.. అలా చేస్తే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందంటే ఎవరూ పెట్టుబడులు పెట్టబోరని.. కాంగ్రెస్ నేతలు పెరిగిన సంపదను దాచిపెట్టి అప్పుల గురించి మాత్రమే మాట్లాడటం స‌రికాద‌ని ఎమ్మెల్యే కేటీఆర్ హిత‌వు ప‌లికారు. అసెంబ్లీలో ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై ఆయ‌న మాట్లాడారు. తెలంగాణను అప్పుల పాలు చేశారని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు్ల్లోనే విరుద్ధ ప్రకటనలు ఉన్నాయన్నారు.

నిక‌ర అప్పు ₹ 3,85,340 కోట్లు
బీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేసిన నిక‌ర‌ అప్పు 3 ల‌క్ష‌ల 85 వేల 340 కోట్ల రూపాయలు మాత్ర‌మే అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. 6 ల‌క్ష‌ల 71 వేల కోట్ల రూపాయల అప్పు ఉంద‌ని కాంగ్రెస్​ ప్రభుత్వం దుష్ప్ర‌చారం చేయ‌డం స‌రికాద‌ని మండిప‌డ్డారు. ఇప్ప‌టికైనా త‌ప్పుడు ప్ర‌చారం మానుకోవాల‌ని సూచించారు.

భ‌ట్టీ.. ఆనాటి మాట‌లు ఏవీ?

దేశంలో ఎన్నో రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ మెరుగైన స్థితిలో ఉంద‌ని కేటీఆర్ అన్నారు. తెలంగాణ చీకట్లో నిండిపోతుందని అప్ప‌టి ముఖ్య‌మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లు చెప్పార‌ని గుర్తు చేశారు. తెలంగాణ వారికి పాలించే సత్తా లేదని, ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంది ఎద్దేవా చేశారన్నారు. పదేళ్లలో రాష్ట్ర ఆదాయం భారీగా పెరిగిందని విపక్షంలో ఆనాడు భట్టి విక్రమార్క చెప్పార‌ని గుర్తు చేస్తూ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మాట‌మార్చార‌ని విమ‌ర్శించారు. తెలంగాణ వచ్చినప్పుడు 2014లో రెవెన్యూ 26 వేల కోట్లు ఉంటే.. 2024లో లక్షా 60 వేల కోట్లుగా ఉందని వివ‌రించారు. తమ హయాంలో తెలంగాణ పరపతి పెరిగిందని గుర్తుచేశారు.

క‌రోనా వ‌ల్ల ఆర్థిక న‌ష్టం జ‌రిగినా…

క‌రోనా వ‌ల్ల‌ ఆర్థిక సంక్షోభం జ‌రిగిన విష‌యం అందిరికీ తెలిసిందే అని, కరోనా వ‌ల్ల ఆర్థిక న‌ష్టం జ‌రిగిన‌ప్ప‌టికీ క‌ల్యాణ‌ల‌క్ష్మి, ఆస‌రా పెన్ష‌న్లు, రైతుబంధు, ఎస్సీ, ఎస్టీ డెవ‌ల‌ప్‌మెంట్‌కు ఇచ్చే డ‌బ్బులు ఆప‌లేద‌ని కేటీఆర్ గుర్తు చేశారు. ఉద్యోగుల‌కు కొంద‌రికి జీతాలు ఆల‌స్యంగా ఇచ్చి ఉండొచ్చున‌ని అన్నారు. కాంట్రాక్ట్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ల‌కు 10 నెల‌లుగా జీతాల్లేవు అని, వారికి జీతాలు చెల్లించాల‌ని కోరారు.

కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌లు వ‌ర్షం

బ‌డ్జెట్‌లో ఆరు గ్యారంటీల‌కు రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం టాటా చెప్పింద‌ని కేటీఆర్ విమ‌ర్శించారు. బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన గురించి మీరు ప్ర‌స్తావించినప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తామెందుకు మాట్లాడకూడదని ప్ర‌శ్నించారు. సీఎం సీటులోకి భట్టి వెళ్లాలని కోరారు. మంచి నిర్ణయాలకు బీఆర్ఎస్ ఎప్పుడూ మద్దతు ఇస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ త‌న ఎన్నిక‌ల మేనిఫెస్టోలో అర‌చేతిలో స్వ‌ర్గం చూపించింద‌ని, బ‌డ్జెట్‌లో మాత్రం మోచేతికి బెల్లం పెట్టింద‌ని రేవంత్ రెడ్డి స‌ర్కార్‌పై నిప్పులు చెరిగారు.

నిర్ణ‌యాత్మ‌క నిర్ణ‌యాల‌కు స‌హ‌కారం అందిస్తాం

ఇప్పుడు ఎన్నిక‌లు లేవు.. మీకు ప్ర‌జ‌లు అవ‌కాశం ఇచ్చారు.. నాలుగున్న‌రేళ్ల పాటు క‌లిసిమెలిసి ప‌నిచేసి ఉజ్వ‌ల తెలంగాణ‌గా తీర్చిదిద్దుదాం.. అందుకు త‌మ స‌హ‌కారం ఎప్పుడూ ఉంటుంద‌ని కేటీఆర్ అన్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీగా ఈ రాష్ట్ర ప్ర‌జ‌ల బాగు కోరుతూ మీరు తీసుకునే నిర్ణ‌యాత్మ‌క నిర్ణ‌యాల‌కు స‌హ‌కారం అందిస్తామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement