Sunday, September 29, 2024

America – అభివృద్ధి, స్వేచ్ఛకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత – తెలుగు కమ్యూనిటీ మీట్ లో భట్టి

హైదరాబాద్ – అభివృద్ధి, స్వేచ్ఛ ప్రధాన అంశాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సదరన్ కాలిఫోర్నియా తెలుగు కమ్యూనిటీ, స్థానిక కాన్సుల్ జనరల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. గతంలో ఫ్యూడల్ మనస్తత్వంతో బందీ చేయబడిన రాష్ట్రాన్ని పూర్తి స్వేచ్ఛయుత రాష్ట్రంగా మార్చామని.. భవిష్యత్తులో ఈ విధానం కొనసాగుతుందని తెలిపారు.

ఎవరు ఏ భావజాలానైనా వ్యక్తపరిచే వాతావరణాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పరిచామని వివరించారు. అమెరికాలో స్థిరపడిన తెలుగు వారి మేధస్సు అంతా తెలంగాణ రాష్ట్రం తో పాటు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఏమాత్రం అవకాశం ఉన్న ఉపయోగపడాలని.. తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టి అభివృద్ధిని పరుగులు పెట్టించాలని వారిని కోరారు.

హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్… ఇళ్ల నిర్మాణం పేరిట రాళ్లు కనుమరుగైపోయాయి. లేక్స్ కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నారు. పార్కులు లేకుండా పోయాయి. లేక్స్ లేకపోతే వరదలు వచ్చినప్పుడు ఇటీవల విజయవాడ నగరం వరదలో చిక్కుకుపోయిన పరిస్థితులు హైదరాబాదులోనూ ఏర్పడతాయి. నది గర్భంలో ఇల్ల నిర్మాణాలు చేస్తున్నారు.

- Advertisement -

వీటిని ఇప్పటికీ ఆపకపోతే భవిష్యత్తు తరాలకు పెద్ద ప్రమాదం వాటిల్లుతుంది. హైదరాబాద్ కి ప్రాణాంతకంగా మారుతుంది. పేదవాళ్లను అడ్డంపెట్టి బిల్డర్స్ నిర్మాణాలు చేపట్టి వ్యాపారం చేస్తున్నారు. ధన, మానప్రాణాలు కాపాడడం ప్రభుత్వం బాధ్యత. ఆస్తులు కాపాడడం ప్రభుత్వం బాధ్యత. అందులో భాగంగా చెరువులను రక్షించేందుకు భవిష్యత్తు తరాలను అందించేందుకు తెలంగాణ రాష్ట్రంలో చర్యలు చేపట్టాం. వందల చెరువులు కనపడకుండా పోయాయి. కనీసం చెరువు గర్భంలో కట్టుకోకుండా అయినా ఆపాలి అనేది మా ప్రభుత్వం ఆలోచన అన్నారు.

మూసీ నదిలో మంచినీరుపారించడం పార్కులు తయారు చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. మూసి పునర్జీవం కార్యక్రమంలో భాగంగా నిర్వాసితులకు పూర్తి అవగాహన కల్పించి పునరావాస చర్యలు చేపడుతున్నాం. వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, వారి పిల్లలు చదువుకునేందుకు అవకాశం కల్పించడం, వారి ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు చేపట్టడం.. వారంతా మంచి వాతావరణంలో బతికేలా చూడడమే ప్రభుత్వ ఉద్దేశం. మూసీ నది పరివాహక ప్రాంతంలో కుటుంబాలు ఆరోగ్యంగా జీవించేందుకు ఆ నదిని తీర్చిదిద్దాలనేది ప్రభుత్వం ఆలోచన. కలుషితమైన మూసీ నదిలో జీవించడం ఎవరికి కూడా మంచిది కాదు అన్నారు. రాష్ట్రంలోని వనరులను గుర్తించి పద్ధతి ప్రకారం వినియోగిస్తాం, రాష్ట్రంలో విద్య, వైద్యం, సేవా రంగాలను తీర్చిదిద్దుతామని, రాష్ట్రసమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుతోపాటు, సింగరేణి సిఎండి బలరాం నాయక్, ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement