Monday, October 21, 2024

All Set – మ‌రికొద్ది సేప‌టిలో గ్రూప్ 1 మెయిన్స్ ప‌రీక్ష‌లు ప్రారంభం ..

హైద‌రాబాద్ – తెలంగాణలో నేటి మ‌ధ్యాహ్నం నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. మొత్తం 563 గ్రూప్ 1 పోస్టులకు తెలంగాణ సర్కారు గతంలో నోటిఫికేషన్ వెలువరించిన సంగతి తెలిసిందే.
అయితే, గత కొన్నిరోజులుగా ఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అలాగే చివ‌రి క్ష‌ణంలో అభ్య‌ర్ధులు సుప్రీం కోర్టును సైతం అశ్ర‌యించారు.. అయితే సుప్రీం ప‌రీక్ష‌లు వాయిదాకు నిరాక‌రించింది.. దీంతో నేటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి అయిదు గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 46 పరీక్ష కేంద్రాల వద్ద ఈ పరీక్షలు జరగనున్నాయి. ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రంలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇక, రాష్ట్రంలోని అన్నీ పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ విధించారు. పరీక్ష కేంద్రాలకు సుమారు 200 మీటర్ల వరకు ఐదుగురికి మించి అభ్యర్థులు ఉండకూడదు. ప్రతి ఎగ్జామ్ సెంటర్ వద్ద ఒక ఎస్సై, మహిళా కానిస్టేబుల్ సహా ఆరుగురు పోలీసులు పర్యవేక్షణలో ఉంటారు.

పరీక్షా కేంద్రాలన్నింటి దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 31,383 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షలు నేటి నుంచి 27వ తేదీ వరకు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాలు, ఆన్సర్‌షీట్స్ తరలింపులో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

వీటిని పాటించాల్సిందే..

పరీక్ష హాలులోకి ఎంటర్ అయ్యే అభ్యర్థులను డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్‌తో తనిఖీ చేశాకే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు .అభ్యర్థులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.అభ్యర్థులు బ్లాక్ లేదా బ్లూ కలర్ బాల్ పాయింట్ పెన్, పెన్సిల్, రబ్బర్, హాల్ టికెట్, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా కార్డును పరీక్షా హాల్‌లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎలాంటి జెల్, స్కెచ్ పెన్స్ ఉపయోగించకూడదు.
హాల్ టికెట్‌పై అభ్యర్థితో పాటు ఇన్విజలేటర్ సంతకం తప్పనిసరి. ఆన్సర్ రాసేందుకు బుక్ లెట్ ఇస్తారు. అడిషనల్స్ ఇవ్వరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement