Monday, September 16, 2024

ADB: మాజీమంత్రి జోగు రామన్నతో ఎమ్మెల్యే పాయల్ శంకర్ భేటీ..

ఆంధ్రప్రభ బ్యూరో ఆదిలాబాద్ : ఒకప్పుడు వాళ్ళిద్దరూ… చిరకాల మిత్రులు.. ఓకే పార్టీ గొడుగు కింద ఆదిలాబాద్ రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న మాజీ మంత్రి జోగు రామన్న, ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ సుదీర్ఘకాలం తర్వాత కలుసుకొని ముచ్చటించారు. పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇందుకు జైనథ్ మండలం దీపాయిగూడ గ్రామం వేదికైంది.

రాజకీయాల్లో శత్రువులు ఉండరు.. అన్న నానుడిని నిజం చేస్తూ… చిరకాల మిత్రులు ఇద్దరూ బుధవారం ఒకే చోట కలుసుకొని మనసు విప్పి మాట్లాడుకోవడo అందరినీ అబ్బురపరిచింది. వివరాల్లోకి వెళితే.. మాజీ మంత్రి జోగురామన్న సోదరుడు జోగు పోతారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బాధిత కుటుంబాన్ని బుధవారం దీపాయిగూడ గ్రామం వెళ్లి పోతారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడుతుండగానే… అదే గ్రామంలో ఉన్న జోగు రామన్న తన సోదరుని నివాసానికి చేరుకొని పాత మిత్రుడు బీజేపీకి చెందిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి కాసేపు ముచ్చటించారు. పోతారెడ్డి ఆసుపత్రిలో అస్వస్థకు గురైన‌ విషయాలను, కుటుంబ నేపథ్యాన్ని వివరించగా, ఎమ్మెల్యే శంకర్ జోక్యం చేసుకొని పోతారెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఇరు కుటుంబాల యోగక్షేమాలను పరస్పరం అడిగి తెలుసుకోవడం గమనార్హం. రాజకీయ పార్టీలు వేరైనా చిరకాల మిత్రులు ఒకే చోట కలుసుకొని మాట్లాడుకోవడం, జోగు రామన్న కుటుంబానికి సానుభూతి ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా మాజీ మంత్రితో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పరామర్శించిన వారిలో బీజేపీ నాయకులు ఆదినాథ్, విజయ్ అంకత రమేష్, రత్నాకర్ రెడ్డి, దీపాయిగుడా మాజీ ఎంపీటీసీ కరుణాకర్ రెడ్డి, తదితరులున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement