Thursday, September 19, 2024

ADB: డ్వాక్రా మహిళల డబ్బు.. రూ.10లక్షలు హాంఫట్

జన్నారం, ఆగస్టు 27 (ప్రభ న్యూస్): రూ.10లక్షల డ్వాక్రా మహిళల డబ్బులు కాజేసి ముఖం చాటేసిన ఓ మోసగాని ఉదంతం వెలుగులోకి వచ్చింది.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇందనపల్లి గ్రామానికి చెందిన ఐకేపీలో పనిచేస్తున్న వీఓఏ గుండ సుధాకర్ అదే గ్రామానికి చెందిన సుమారు 60మంది డ్వాక్రా మహిళల రూ.10 లక్షలు బ్యాంకులో జమ చేయకుండా, సొంతానికి వాడుకున్నట్లు బోగట్టా.

గత 3నెలలుగా అతను డ్వాక్రా మహిళలకు అందుబాటులో లేకుండా ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారైనట్లు సమాచారం. వాడుకున్న డబ్బుల నుండి రూ.రెండు లక్షలు చెల్లించినట్లు, మిగతా డబ్బులు వాయిదాలుగా చెల్లించడానికి ఓ ఐకేపీ అధికారి ఎదుట అంగీకరించినట్లు తెలిసింది.

- Advertisement -

ఈ విషయమై ఐకేపీ ఏపీఎం సిహెచ్ బుచ్చన్నను మంగళవారం మధ్యాహ్నం ప్రశ్నించగా, ఆ వీఓఏ సుధాకర్ ఆ గ్రామ డ్వాక్రా మహిళల డబ్బులను సొంతానికి వాడుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. డబ్బులు కడతానని ఒప్పుకున్నట్లు ఆయన చెప్పారు. విచారణ జరుపుతున్నామన్నారు. ప్రస్తుతం అతను అందుబాటులో లేడని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement