Saturday, July 6, 2024

TG: అవిశ్వాసం వేళ బీఆర్ఎస్ కు మరో షాక్… కాంగ్రెస్ లోకి ఫ్లోర్ లీడర్

ఆంధ్రప్రభ బ్యూరో ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ బీఅర్ఎస్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్ తో పాటు అదే పార్టీకి చెందిన మరో కౌన్సిలర్ ఇమ్రాన్ బుధవారం కాంగ్రెస్ గూటికి చేరారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీపై ఈనెలలో అవిశ్వాస సమావేశం నిర్వహించేందుకు కలెక్టర్ తేదీ ఖరారు చేయగా, అనూహ్యంగా భుక్తాపూర్ (45) వార్డు సీనియర్ కౌన్సిలర్, బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, అదే పార్టీకి చెందిన కౌన్సిలర్ ఇమ్రాన్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

గులాబీ పార్టీలో కౌన్సిలర్ల వరుస రాజీనామాలు, వెంటనే కాంగ్రెస్ లో చేరిపోవడం లాంటి పరిణామాలు ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఇటీవల వారం రోజుల కిందటే నలుగురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరగా, బుధవారం మరో ఇద్దరు సీనియర్ కౌన్సిలర్లు అదేబాటలో కాంగ్రెస్ గూటికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


అవిశ్వాసంపై సన్నగిల్లిన ఆశలు..
బీఆర్ఎస్,బిజెపి కౌన్సిలర్ల సంతకాలతో వైస్ చైర్మన్ జహీర్ రంజానీ పై అవిశ్వాసం ప్రతిపాదిస్తూ జూన్ 19న కలెక్టర్ కు నోటీస్ అందించారు. ఈనెల 18న అవిశ్వాసంపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ నోటీసు జారీ చేయగా, కౌన్సిలర్ల పార్టీ ఫిరాయింపులు బీఆర్ఎస్ లో కలకలం రేపుతున్నాయి. 24మంది సంఖ్యాబలం ఉన్న గులాబీ పార్టీలో వారం రోజుల్లోనే ఆరుగురు కౌన్సిలర్లు పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకోగా, మరో ఇద్దరు కౌన్సిలర్లు రెండు రోజుల్లో కాంగ్రెస్ లో చేరుతారనీ ప్రచారం సాగుతోంది. బీజేపీ మద్దతుతో అవిశ్వాసం నెగ్గుతుందని భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి వరుస వలసలు ఆందోళన కలిగిస్తున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement