Thursday, October 3, 2024

TG: ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు… మంత్రి పొన్నం

కరీంనగర్ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అందజేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. గురువారం కరీంనగర్ జిల్లా తాహెర్ కొండాపూర్ లో పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయంగా తాహేర్ కొండాపూర్ గ్రామంలో పలు నివాసాలకు వెళ్లి వివరాలు నమోదు చేశారు. రాష్ట్రంలో ఆధార్ కార్డు వలే ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

ఈ డిజిటల్ కార్డుల ద్వారానే రేషన్ కార్డు, హెల్త్ కార్డు, పింఛను, ప్రభుత్వ పథకాలన్నీ ప్రామాణికం కానున్నాయన్నారు. రాష్ట్రం మొత్తం 119 నియోజకవర్గాల్లో 288 చోట్ల ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభం అయిందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం కోసం ఒక గ్రామం, మున్సిపాలిటీలో ఒక వార్డ్ పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేశారన్నారు. ఎంత మంది పౌరులున్నా కుటుంబం పరంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పం తీసుకుందన్నారు.

కుటుంబ సభ్యుల సంఖ్య ఒక గ్రూప్ ఫోటో లాంటి వివరాలు మాత్రమే అడుగుతారన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, ఇంట్లో నలుగురు పిల్లలు ఉండి పెళ్ళిళ్ళు అయి వారికి పిల్లలున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇస్తారన్నారు. ఈ కార్డు ఉంటే ప్రభుత్వ పథకాలు ఎక్కడైనా తీసుకోవచ్చన్నారు. డిజిటల్ గుర్తింపు కార్డు ఫ్యామిలీ పెద్దగా మహిళ పేరే ఉంటుందన్నారు.

- Advertisement -

గుర్తింపు కార్డు ద్వారానే ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు ప్రభుత్వ పథకాల‌న్నీ డిజిటల్ కార్డు ద్వారానే వస్తాయన్నారు. కర్ణాటక హర్యానా లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఈ డిజిటల్ కార్డులను అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి పురమల్ల శ్రీనివాస్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement