Saturday, October 19, 2024

TG | ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి 4వేల ఇందిర‌మ్మ ఇళ్లు.. మంత్రి పొంగులేటి

హైదరాబాద్ : ఈనెల చివ‌రి నాటికి రాష్ట్రంలోని ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి తొలివిడ‌తగా 3500 నుంచి 4వేల ఇళ్ల‌ను మంజూరు చేయ‌బోతున్నామ‌ని రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌క‌టించారు. వ‌చ్చే నాలుగు సంవ‌త్స‌రాల్లో రాష్ట్రంలో అర్హులైన పేద‌వారంద‌రికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వ‌డ‌మే ఈ ఇందిర‌మ్మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌న్నారు. వచ్చే నాలుగు సంవ‌త్స‌రాల్లో 20ల‌క్ష‌ల ఇళ్ల‌కు త‌గ్గ‌కుండా నిర్మిస్తామ‌ని తెలిపారు.

కులాలు, మ‌తాలు, ప్రాంతాలు, పార్టీలు, ఎలాంటి తేడా లేకుండా అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ ఇందిర‌మ్మ ఇండ్లు ఇవ్వ‌డ‌మే ఈ ప్ర‌భుత్వ ఆశ‌య‌మ‌న్నారు. ఎలాంటి భేష‌జాల‌కు పోకుండా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావ‌ల‌సిన వాటా, నిధులు అడిగి తీసుకుంటామ‌ని, పెద్ద ఎత్తున రాష్ట్రానికి ఇండ్ల‌ను మంజూరు చేయాల‌ని నిన్న హైద‌రాబాద్‌కు వ‌చ్చిన కేంద్ర హౌసింగ్ జాయింట్ సెక్ర‌ట‌రీని కోర‌డం జ‌రిగిందన్నారు. గ‌త ప్ర‌భుత్వం పేద‌వాడి గురించి క‌నీస ఆలోచ‌న చేయ‌లేద‌ని, పైన ప‌టారం, లోప‌ల లోటారం అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించింద‌ని విమ‌ర్శించారు.

- Advertisement -

ఘోషా మ‌హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన 144 మంది ల‌బ్దిదారుల‌కు శ‌నివారం హైద‌రాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర ర‌వాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌తో క‌లిసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప‌ట్టాలు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి మాట్లాడుతూ… ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా ప్ర‌తిప‌క్షాలు కాళ్ల‌ల్లో క‌ట్టెలు పెడుతూ అభివృద్ది సంక్షేమాన్ని అడ్డుకోవాల‌ని ప్ర‌య‌త్నించినా ఏదీ ఆగ‌ద‌ని, పేద‌వాడి క‌న్నీరు తుడ‌వ‌డ‌మే ఈ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌న్నారు.

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ కాకి గోల వ‌ల్ల త‌మ ప్ర‌భుత్వానికి వ‌చ్చే న‌ష్ట‌మేమీ లేదని, ఏడాది కూడా పూర్తికాక‌ముందే త‌మ ప్ర‌భుత్వంపై రోడ్డు ఎక్క‌డం వ‌ల్ల బీఆర్ఎస్ కే న‌ష్ట‌మ‌న్నారు. రెండున్న‌ర సంవ‌త్స‌రాల తర్వాత రోడ్డెక్కినా ఒక అర్ధ‌ముంటుంద‌న్నారు. ప‌ది సంవ‌త్స‌రాల్లో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేయలేనిది, త‌మ ప్ర‌భుత్వం చేసి చూపిస్తుంటే ప్ర‌తిప‌క్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయ‌ని విమ‌ర్శించారు. మూసీ ప‌రివాహ‌క ప్రాంత ప్ర‌జ‌ల‌కు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాల‌న్న ఉద్దేశ్యంతో త‌మ ప్ర‌భుత్వం వారికి ఇండ్లు, ఉద్యోగం, ఉపాధి, క‌ల్పిస్తే బీఆర్ఎస్ ఓర్చుకోలేక పోతోంద‌ని, ప్ర‌భుత్వం ఏదో త‌ప్పు చేస్తున్న‌ట్లుగా గోబెల్ ప్ర‌చారం చేస్తుంద‌ని దుయ్య‌బ‌ట్టారు. మూసీ సుంద‌రీక‌ర‌ణ కాదు, మూసీ ప‌రివాహ‌క ప్రాంతాల ప్ర‌జ‌ల జీవ‌నోపాధి కోసం వారి జీవితాల‌ను మెరుగు ప‌ర‌చ‌డానికి త‌మ ప్ర‌భుత్వం చిత్త‌శుద్దితో ప‌నిచేస్తుంద‌న్నారు.

మూసీ ప‌రివాహ‌క ప్రాంతాల ప్ర‌జ‌లు త‌మ జీవిత కాలం అదే మురికికుప్పలో బ్ర‌త‌కాల‌ని బీఆర్ఎస్ కోరుకుంటుందా అని మంత్రి ప్ర‌శ్నించారు. మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ… ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతుందన్నారు. మూసీ పునర్జీవనంపై అనేక అభాండాలు వేస్తున్నారు.. అక్కడున్న పేదవారిని అక్కడే వదిలేస్తారా.. మూసి రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసింది మీరు కాదా. ఇప్పుడు వారికి డబుల్ బెడ్రూం లు కేటాయించి మెప్మా ద్వారా వారికి ఉపాధి అవకాశాలు, పిల్లలకు చదువులు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంటే ఓర్వలేకపోతున్నారన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు గళ్ళల పైసలతో ఇచ్చామ‌న్నారు.

కానీ గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు చేసి 40 వేల కోట్ల బిల్లులు పెండింగ్ బకాయిలు చేశారన్నారు. రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురి చేసే విధంగా ప్రభుత్వం ఇబ్బందులు పరిష్కరిస్తూ ముందుకు వెళ్తుంటే రాజకీయం చేస్తున్నారన్నారు. మీరు బాధ్యత గల ప్రతిపక్షం అయితే నిర్మాణాత్మక సలహాలు ఇవ్వండన్నారు. కాంగ్రెస్ పార్టీకి పరిపాలన ఎలా చేయాలో ప్రతిపక్షాలకు ఎలా గౌరవం ఇవ్వాలో తెలుసన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజాసింగ్, శ్రీ గణేష్, ఎమ్మెల్సీలు బలమూరి వెంకట్, రహమత్ బేగ్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురషెట్టి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement