ఆసిఫ్నగర్లోని ఆఫ్జల్సాగర్ నాలాలో విషాదం చోటుచేసుకుంది. వరద నీటిలో కొట్టుకుపోయి మామ–అల్లుడు గల్లంతయ్యారు. గల్లంతైన వారిని అర్జున్, రామ గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, గల్లంతైన వారి ఆచూకీ లభించలేదు.
ప్రస్తుతం మాన్సూన్ విభాగం, రెస్క్యూ టీములు కలిసి గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సహాయక సిబ్బంది జాగ్రత్తగా గాలిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది.
మరోవైపు, గచ్చిబౌలి పరిధిలోని వట్టినాగులపల్లిలో ఆదివారం రాత్రి తీవ్రమైన విషాదం చోటు చేసుకుంది. వర్షం కారణంగా బలహీనమైన ఓ పాతింటి గోడ ఒక్కసారిగా కూలిపోగా, అక్కడ నివసిస్తున్న ఒకరు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడినవారిని తక్షణమే సమీపంలోని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం స్థిరంగా ఉన్నప్పటికీ, మరికొందరికి శస్త్రచికిత్సలు అవసరమని వైద్యులు తెలిపారు.

