Sunday, September 22, 2024

Tirumala – అన్యులకు అందలం! – తనిఖీలకు మంగళం

ఫుడ్ సేఫ్టీకి మొత్తానికే తిలోదకాలు!

ఆగమ ధర్మం పేరుతో అక్రమాలకు తెర

తిరుమలలో అడుగుపెట్టని సేఫ్టీ ఆఫీసర్లు

అంతర్జాతీయ పుణ్యక్షేత్రంలో ఇంత దారుణమా

అన్ని రూల్స్ని పక్కనపెట్టిందెవరు

- Advertisement -

శ్రీవారికి ప్రీతిపాత్రమైన లడ్డూలో అన్య పదార్థాలు

అపచారం జరిగిందంటున్న వేదపండితులు

నెయ్యిలో కల్తీపై అనుమానం ఎలా వచ్చింది

తక్కువ ధరకు కోట్ చేయడమే కారణమా?

విశాఖ స్వామీజీ అనుచ‌రుల‌కే నెయ్యి కాంటాక్టా?

ఆహార ప‌దార్థాల త‌నిఖీల‌కు తిరుమ‌ల‌లో ల్యాబ్

₹20కోట్లు కేటాయింపు..

స‌రికొత్త టెక్నాల‌జీతో ఏర్పాటుస్థ‌లం కూడా కేటాయిస్తామ‌న్న ఈవో శ్యామ‌ల‌రావు

ఆంధ్రప్రభ స్మార్ట్, సెంట్రల్ డెస్క్ :తిరుపతిలో ఆహార నాణ్యత ప్రమాణాల రక్షణకు ఫుడ్ సేప్టీ అధికారులు ఉన్నారు. వీరంతా తిరుపతిలోని హోటళ్లు.. రోడ్డు పక్కన చిరు వ్యాపారుల చుట్టూ ఈగల్లా ముసురుతుంటారు. కానీ, తిరుపతిలో మాత్రం ఫుడ్ సేఫ్టీ గురించి ఎన్న‌డూ ప‌ట్టించుకున్న పాపాన పోలేదు.

తిరుపతి లడ్డూ తయారీలో అయిదేళ్లుగా కల్తీ జరిగిందనే అంశం తెరమీదకు రావటంతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వెంకన్న భక్తులు తీవ్ర ఆగ్రహంతో ర‌గిలిపోతున్నారు. అసలు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారా? నిద్దరోతున్నారా? మామూళ్ల మత్తులో జోగుతున్నారా? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే.. షిరిడీ, కాశీ, విజయవాడ ఇంద్రకీలాద్రి, తిరుపతి పుణ్య క్షేత్రాలకు అంతర్జాతీయ హోదా లభించింది. కేవలం తిరుమలలోనే అన్నప్రసాదాల నాణ్యత ప్రమాణాలను ఎందుకు తనిఖీ చేయరు? అని ప్రశ్నిస్తే తనిఖీ అధికారం ఎవ్వరికీ లేదనేది స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఇది ఆగమ శాస్త్ర‌ ధర్మమట. ప్రసాదాల తయారీ కేంద్రం పోటులోకి ఎవ్వరికీ ప్రవేశం లేదు. అవును.. ఇప్పటికీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అంటే చాలా చులకన. కానీ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అధారిటీ ఆఫ్ ఇండియా 2006చట్టాన్ని అన్ని పుణ్యక్షేత్రాల్లోనూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. కానీ, తిరుమలలో ప్రసాదాలను తనిఖీకి ఏపీ ప్రభుత్వమే అవకాశం ఇవ్వలేదు.

ఈ అతి రహస్యం వెలుగులోకి ఎలా?

తిరుపతి పుణ్యక్షేత్రంలో ఫుడ్ సేప్టీ చట్టం అమలు నామ మాత్రమే. పోటులోకి అన్యులకు ప్రవేశం లేదు. ప్రసాదాల తయారీ అత్యంత రహస్యం. దిట్టం చిట్టా ప్రకారం ప్రసాదం తయారీలో వినియోగించే ముడిసరుకులు వంటశాలకు వెళ్తాయి. లడ్డూలు, ప్రసాదాలు బయటకు వస్తాయి. వీటిలో ఏ పదార్థాలు ఏ నిష్పత్తిలో వాడార‌నే విష‌యాన్ని ఏ అధికారి ప్రశ్నించకూడదు.. ఎందుకంటే, తిరుపతి లడ్డూకి పేటెంట్ హక్కు ఉందనే వంక చూపిస్తారు. ఆ పేటెంట్ హక్కు ప్రకారమే నాణ్యమైన ప్రసాదాన్ని తయారు చేశారా? లేదా? అని ప్రశ్నించటానికి ఆగమ శాస్త్రం అనుమతి లేదని తెలుస్తోంది.

ఇలాంటి స్థితి లడ్డూల‌ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం కథ ఎలా వెలుగు చూసింద‌ని అంద‌రిలో సందేహం క‌లుగుతోంది. అయితే దీనికి కేవలం కిలో నెయ్యి ధర విష‌య‌మే స‌మాధానంగా తెలుస్తోంది. బహిరంగ మార్కెట్‌లో కిలో ₹600 పలికే నెయ్యి.. ₹400 ఎలా లభిస్తుంది?.. ఇందులో ఏం మర్మం ఉంది? అనే ప్రశ్న..

మొత్తం వ్యహరాన్ని బయటకు తీసింది. ప్రస్తుత ఈవో శ్యామలరావు ఎంతో శ్రద్ధగా.. తిరుమలకు చేరిన నెయ్యి లారీలను పోటు బయట నుంచే నేషనల్ డెయిరీ ల్యాబ్కు పంపించారు. అప్పుడు నెయ్యిలో దాగి ఉన్న కల్తీ పదార్థాల అసలు కథ వెలుగు చూసింది.

ఆగమ ధర్మాన్ని ఆగం చేసిందెవరు?

ఆగమ ధర్మం ప్రకారం పోటులోకి వెళ్లే బ్రాహ్మణుడు నిష్టతో మడిస్నానం చేస్తారు. ఎంతో పవిత్రంగా వ్యవహరిస్తారు. అందుకే అన్యులకు ప్రవేశం ఉండదు. కానీ.. స్వామి ప్రసాదం తయారీలో కల్తీ వ్యవహారం ఎలా పునాది పడింది. తరతరాలుగా జరగని కల్తీ వ్యవహారం ఇప్పుడే ఎలా జరిగింది. విశాఖలోని ఓ స్వామీజీ అనుంగులకే నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఎందుకు లభించిందనే ప్రశ్నలు కూడా అందరిలో తలెత్తుతున్నాయి.

దీనికి కేవలం ఆగమ ధర్మాచరణ పేరుతో ఈ నెయ్యి కల్తీ దందా అయిదేళ్ల పాటు సాగిందని స్పష్టం అవుతోంది. ఫుడ్ సేఫ్టీ అధికారులకు అంటరాని వారిగా చిత్రీకరించారు. ఎక్కడైనా ఆహార పదార్థాల నాణ్యత పరీక్షించవచ్చు.. కానీ తిరుమలలో తనిఖీ చేయటానికి వీలులేదంటూ ఆఫీసర్లను కట్టడి చేశారు.

ఈవో శ్యామలరావు లోతుగా పరిశీలించి.. ఓ కమిటీని వేసి విశ్లేషించటంతో.. అసలు రంగు బయటపడిందని సమాచారం.

తెరమీదకు రాష్ట్ర ల్యాబ్..

తిరుపతి వెంకన్న లడ్డూలో కల్తీ నెయ్యి కథ… కాస్త ప్టేట్ ఫుడ్ ల్యాబ్ ఏర్పాటుకు దారి తీసింది. ఇప్పటికే విశాఖపట్నంలో ఒక మైక్రో ల్యాబోరేటరీని ప్రధాని మోదీ ప్రారంభించారు. మరో ఆరునెలల్లో పరిపూర్ణ కార్యకలాపాలు స్పీడ్ అందుకుంటాయి. ఇప్పటికే తిరుపతి, గుంటూరులో ఇంటిగ్రేటెడ్ లాబరేటరీలు మంజూరయ్యాయి. ఈ ల్యాబ్లను ₹19 కోట్లతో ఏర్పాటు చేయాలి. దీనికి భవనాలను ప్రభుత్వం ఇవ్వాలి. ఇక కొత్తగా తిరుమలలోనూ ₹20కోట్లతో ఫుడ్ సేఫ్టీ లాబ్ ఏర్పాటుకు ఎఫ్ ఎస్ ఎస్ ఏఐ తో ఒప్పందం కుదిరింది.

ల్యాబ్ ఏర్పాటుకు స్థలం ఇస్తామన్న ఈవోల్యాబ్ ఏర్పాటునకు 42000 చదరపు గజాల భవనాలను ఇవ్వటానికి టీటీడీ ఈవో శ్యామలరావు అంగీకరించారు. ల్యాబ్ ఏర్పాటుకు ₹22 కోట్లు ఖర్చవుతుంది. అందుబాటులోకి వస్తే ప్రతి అన్నప్రసాదాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖి చేస్తారు. పోటు నుంచి వచ్చిన పదార్థాలను విధిగా తనిఖీ చేస్తారు. ఈ స్థితిలో కల్తీకి అవకాశం ఉండదు.

ఇక కర్నూలు లోనూ మరో ల్యాబ్ ఏర్పాటు చేయనున్నారు. తిరుమల, కర్నూలు ల్యాబ్ లు అందుబాటులోకి వస్తే అత్యంత ఆధునిక టెక్నాలజీతో పదార్థాలను తనిఖీ చేసే అవకాశం ఉంటుంది. ఫలితంగా తిరుమలలో స్వామి ప్రసాదం తయారీలో ఎలాంటి అపచారాలకు అవకాశం ఉండదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement