రాష్ట్రంలోని గిరిజన, ఆదివాసీ బిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ -10లో నూతనంగా నిర్మించిన కుమ్రం భీం ఆదివాసీ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… ఈ భవనం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
అస్తిత్వాన్ని కోల్పోయిన తెంలగాణ తన అస్తిత్వాన్ని నిలబెట్టుకొని సొంత రాష్ట్రంగా వచ్చిన ఈ సందర్భంలో ఆదివాసీ గిరిజన బిడ్డలు, లంబాడీ బిడ్డలు అందరికీ కూడా మేం తల ఎత్తుకుని ఇది మా రాష్ట్రం, ఇది మా కుమ్రం భీం ఆదివాసీ భవన్ అని చెప్పుకునేటటువంటి మంచి కమ్యూనిటీ హాల్స్ నిర్మించామన్నారు. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మనం నిర్మాణం చేసుకున్నామన్నారు. ఈ రోజు ఈ భవనం తనతో ప్రారంభింపజేసుకున్నందుకు తెలంగాణ గిరిజన బిడ్డలందరికీ హృదయపూర్వకమైన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. ఈ భవనం యావత్ రాష్ట్రంలో ఉండే ఆదివాసీ బిడ్డల హక్కుల పరిరక్షణ వేదిక కావాలన్నారు.