Monday, October 21, 2024

తెలంగాణ గ‌రంగ‌రం.. మోడీ వ్యాఖ్య‌ల‌పై నిరసనలకు పిలుపునిచ్చిన కేటీఆర్

ఏందీ అడ్డ‌గోలు మాట‌లు.. అస్స‌లు ఏం మాట్లాడుతున్న‌రో అర్థ‌మైతుందా.. ప్ర‌ధాని స్థాయి వ్య‌క్తి ఇట్ల‌నే మాట్లాడుత‌రా.. ఇంత అక్క‌సు వెళ్ల‌బోసుకోవ‌డ‌మా.. కోపం ఉంటే మ‌మ్మ‌ల్ని అనుండ్రి.. తెలంగాణ ఉద్య‌మాన్ని కించ‌ప‌రిస్తే ఇక్క‌డ ఎవ‌రూ ఊరుకోరు.. అని టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ మండిప‌డ్డారు. రేప‌టి నుంచి బీజేపీపై, ఆ పార్టీ లీడ‌ర్ల‌ను నిల‌దీయాల‌ని, ప్ర‌ధాని మోడీ దిష్టి బొమ్మ‌లు ఏడికాడ కాల‌బెట్టాల‌ని పిలుపునిచ్చారు.

ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. మోడీ వ్యాఖ్యలను అటు కాంగ్రెస్ తో పాటు, టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఎంతో పోరాడి తాము తెలంగాణ తెచ్చుకుంటే, రాష్ట్ర విభజన సరిగా జరగలేద‌ని మోదీ అనడం టీఆర్ఎస్ నేతలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది.

తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంటులో విషం చిమ్ముతూ అడ్డగోలుగా మాట్లాడారంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణలోని అన్ని మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో బీజేపీ పార్టీ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని సూచించారు. నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement