Saturday, September 21, 2024

భాగ్య‌ల‌క్ష్మీ టెంపుల్ కి వ‌స్తా నిరూపించు – ఈట‌ల‌కు రేవంత్ స‌వాల్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీకీ బీఆర్‌ఎస్‌ నుంచి రూ.25 కోట్లు ముట్టాయని, తాను చెప్పింది అబద్ధమని గుండెలపై చేయివేసుకుని చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే, చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్ కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డికి సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ పార్టీకి ఏ చిన్న ఇబ్బంది ఎదురైనా ముందుగా స్పందించేది సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆరేనని తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఈ రెండు పార్టీలు ఒకటేనని, ఒకే నాణానికి ఉన్న బొమ్మ, బొరుసు వంటివని బీజేపీ ఎమ్మెల్యే, చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల ముందో, ఎన్నికల తర్వాతో ఆ రెండు పార్టీలు పొత్తుతో కలుస్తాయని స్పష్టం చేశారు.

త‌డి బ‌ట్ట‌ల‌తో భాగ్య‌ల‌క్ష్మీ టెంపుల్ కి వ‌స్తా నిరూపించు – రేవంత్ రెడ్డి
బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. మునుగోడు ఉప ఎన్నికల కోసం బీఆర్‌ఎస్‌ లేదా కేసీఆర్‌ నుంచి రూ.25 కోట్లు తీసుకున్నామని రాజేందర్‌ చేసిన ఆరోప ణలపై రేవంత్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. డబ్బులు తీసుకున్నట్లు ఈటల నిరూపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో దిగజారి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ‘నేను కేసీఆర్‌ లేదా బీఆర్‌ఎస్‌ నుంచి డబ్బులు తీసుకున్నాను ఈటల రాజేందర్‌ ఆరోపణలు చేశారు. శనివారం సాయంత్రం 6 గంటలకు చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల దగ్గరు వస్తాను. బీఆర్‌ఎస్‌ లేదా కేసీఆర్‌ నుంచి డబ్బులు తీసుకోలేదని తడిబట్టలతో ప్రమాణం చేస్తాను. ఈటల రాజేందర్‌ కూడా వచ్చి ప్రమాణం చేయాలి. ఒక వేళ‌ భాగ్యలక్ష్మి టెంపుల్‌ కాకుండా మిగతా ఏ దేవాల యానికైనా నేను రెడీ. నువ్వు చెప్పిన గుడి వద్దకే వస్తాను. నేను డబ్బలు తీసుకోలేదని దేవుడిపైన ఒట్టేసి చెబుతా. నా సవాల్‌ను స్వీకరించి ఈటల రాజేందర్‌ గుడికి వచ్చి ప్రమాణం చేయాలి’ అని రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement