దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళను కలిశారు అన్నాడీఎంకే అగ్రనేత పన్నీర్ సెల్వం, ఆయన సోదరుడు రాజ. దాంతో పార్టీ నుంచి వారిద్దరితో పాటు మరో ముగ్గురిని బహిష్కరిస్తున్నట్లు అన్నా డీఎంకే అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏఐఏడీఎంకే సమన్వయకర్త పన్నీర్సెల్వం, కోఆర్డినేటర్ కే పళనిస్వామి సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. రాజాతో పాటు పార్టీ నుంచి బహిష్కరణకు గురైనవారిలో తేని జిల్లా సాహిత్య విభాగం కార్యదర్శి ఎస్ మురుగేశన్, తేని జిల్లా మత్స్యకారుల విభాగం కార్యదర్శి వైగై కరుప్పుజీ, గూడలూరులోని జయలలిత పేరవై కార్యదర్శి ఎస్ సేతుపతి ఉన్నారు. బహిష్కరణకు గురైన నేతలతో పార్టీకి సంబంధించిన అంశాలను చర్చించరాదని అన్నాడీఎంకే అగ్ర నేతలు ఓ పన్నీర్సెల్వం, ఎడప్పాడి కె పళనిస్వామి కార్యకర్తలను ఆదేశించారు.మరోవైపు తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై ఓరాజా తేనిలో విలేకరులతో మాట్లాడుతూ.. అన్నాడీఎంకేకు ప్రస్తుతం శశికళ నాయకత్వం అవసరం ఉందని అన్నారు. తనను పార్టీ నుంచి బహిష్కరించడానికి వాళ్లేవరు.. అని పన్నీర్ సెల్వం, పళనిస్వామిలను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
తాను పార్టీ వ్యవస్థాపకులైన ఎంజీ రామచంద్రన్ అప్పటి నుంచి పార్టీలో సభ్యునిగా ఉన్నానని చెప్పారు. తర్వాత జయలలిత నాయకత్వంలో పార్టీలో సభ్యునిగా ఉన్నానని తెలిపారు. తనకు శశికళ ప్రధాన కార్యదర్శి అని.. పార్టీ నుంచి తన బహిష్కరణ చెల్లదని చెప్పారు. శశికళతో భేటీలో ఏం చర్చించారని అడిగి ప్రశ్నపై సమాధానమిచ్చిన రాజా.. పార్టీని నడిపించాలని ఆమెను అభ్యర్థించినట్టుగా చెప్పారు. జయలలిత మరణానంతరం తమిళనాడులో అన్నాడీఎంకే పరిస్థితి దారుణ స్థితికి చేరింది. వరుస ఓటములతో ఉక్కిరిబిక్కిరి అయింది. ఆమె మరణం తర్వాత పార్టీని గుప్పిట్లోకి తీసుకున్న పన్నీర్ సెల్వం, పళనిస్వామిలు పార్టీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీని తిరిగి గాడిలో పెట్టాలంటే శశికళకు పార్టీ బాధ్యతలు అప్పగించడం మేలన్న అభిప్రాయాన్ని అటు నేతలు, ఇటు కార్యకర్తలు వెల్లడిస్తున్నారు. ఇందుకు పన్నీరు సెల్వం వర్గం నుంచి సానుకూల సంకేతాలు వస్తున్న.. పళనస్వామి మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి ఏం జరగనుందో చూడాలి.