Wednesday, October 23, 2024

జూడాలకు మెరుగైన స్టైఫండ్‌ ఇస్తాం: కేసీఆర్

క‌రోనా విప‌త్క‌ర‌ సమయంలో జూనియ‌ర్ డాక్ట‌ర్లు స‌మ్మెకు పిలుపునివ్వ‌డం సరికాదు అని సీఎం కేసీఆర్ అన్నారు. ప్ర‌జారోగ్య దృష్ట్యా త‌క్ష‌ణ‌మే విధుల్లో చేరాల‌ని జూడాల‌కు సీఎం సూచించారు. జూడాల ప‌ట్ల ప్ర‌భుత్వం ఏనాడూ వివ‌క్ష చూప‌లేదన్నారు. న్యాయ‌మైన డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. స‌మ‌య‌, సంద‌ర్భాలు చూడ‌కుండా విధుల‌ను బ‌హిష్క‌రించ‌డం సరికాదన్నారు. జూనియ‌ర్ వైద్యుల స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. సీనియ‌ర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌర‌వ వేతం 15 శాతం పెంచాల‌ని నిర్ణ‌యించారు.

బుధవారం ప్రగతి భవన్ లో వైద్యశాఖ అధికారులతో రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వాక్సినేషన్ కార్యక్రమం, తదితర అంశాల మీద సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ల విషయాన్ని వైద్యాధికారులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలపై సిఎం మాట్లాడుతూ….‘‘జూనియర్ డాక్టర్లవి న్యాయమైన కోరికలు అయినపుడు,  పరిష్కరించడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం వుండబోదు. వాటిని ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవచ్చు. అంతేకానీ, చీటికి మాటికి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా, సమయాసందర్బాలను కూడా చూడకుండా, సమ్మె పేరుతో విధులను బహిష్కరించడం సరియైన పద్దతి కాదు. అదీకూడా, కరోనా వంటి అత్యవసర పరిస్థితుల్లో ఇటువంటి నిర్ణయాన్ని ప్రజలు హర్షించరు’’ అని సీఎం కెసిఆర్  చెప్పారు.

మూడు సంవత్సరాల వైద్య విద్య అభ్యసించి కోవిడ్ సేవల కొరకు కొనసాగుతున్న వైద్య విద్యార్దులకు కూడా సీనియర్ రెసిడెంట్లకిచ్చే గౌరవ వేతనాన్ని అందించాలని సీఎం నిర్ణయించారు. కరోనా సేవలందిస్తున్న నేపథ్యంలో జూనియర్ డాక్టర్లకు, వారి కుటుంబ సభ్యులకు  నిమ్స్ లో ఇప్పటికే అందిస్తున్న వైద్య సేవలను మరింత మెరుగ్గా అందించాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికే నిబంధనలమేరకు ఎక్స్ గ్రేషియాను కూడా అందిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వారి కోరికమేరకు సత్వరమే అందించాలని అధికారులను  సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఇది కూడా చదవండి: సీబీఐ కొత్త డైరెక్టర్‌గా సుబోధ్ కుమార్ జైశ్వాల్

Advertisement

తాజా వార్తలు

Advertisement