Tuesday, September 17, 2024

మంత్రి కేటీఆర్‌తో కంటోన్మెంట్ ఆర్మీ అధికారుల భేటీ.. రోడ్ల మూసివేత‌పై చ‌ర్చ‌

హైదరాబాద్ సిటీలో కంటోన్మెంట్ రోడ్ల మూసివేత, ఇతర అంశాలపై మంత్రి కేటీఆర్‌తో ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు ఇవ్వాల‌ సమావేశమై చ‌ర్చించారు. మెహిదీప‌ట్నంలోని కంటోన్మెంట్ ఏరియాకు సంబంధించిన వ‌ర‌ద కాల్వ వంటి స‌మ‌స్య‌ల‌పై విస్తృతంగా చ‌ర్చించారు. నానక్‌రామ్‌గూడ‌లోని హెచ్‌జీసీయ‌ల్ కార్యాల‌యంలో ఈ స‌మావేశం జ‌రిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు త‌ర్వాత‌ హైద‌రాబాద్‌లో పెద్ద ఎత్తున మౌలిక వ‌సతుల క‌ల్ప‌నకు కృషి చేస్తున్నామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందులో భాగంగా న‌గ‌రం న‌లుదిక్కులా భారీ ఎత్తున రోడ్ల నిర్మాణం, విస్త‌ర‌ణ వంటి కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నామ‌ని అన్నారు. కంటోన్మెంట్ ఏరియాల్లో కూడా మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న జ‌రిగింద‌ని కేటీఆర్ తెలిపారు. అయితే స్కైవేల నిర్మాణం విష‌యంలో కేంద్ర ర‌క్ష‌ణ శాఖ అనుమ‌తులు ఇవ్వ‌డం లేద‌న్నారు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారులు ప‌లుమార్లు క‌లిసి విజ్ఞ‌ప్తులు చేసిన‌ప్ప‌టికీ ఎలాంటి స్పంద‌న లేద‌ని కేటీఆర్ గుర్తు చేశారు. కంటోన్మెంట్ ఏరియాలో ప‌దేప‌దే రోడ్ల‌ను మూసివేయ‌డంతో.. స్థానిక ప్ర‌జ‌ల‌కు అనేక ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని కేటీఆర్ ఆర్మీ అధికారుల‌కు వివ‌రించారు.

కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అన్నిరకాలుగా స‌హ‌క‌రిస్తామ‌ని దక్షిణ భారత లెఫ్టినెంట్ మేజ‌ర్ జనరల్ అరుణ్‌, ఇతర ఉన్నతాధికారులు మంత్రి కేటీఆర్‌కు హామీ ఇచ్చారు. రోడ్ల మూసివేత అంశంపైన ప్రధానంగా చర్చించి, త్వరలోనే ఆర్మీ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఒక ఉమ్మడి ఇన్‌స్పెక్ష‌న్ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. దీంతో పాటు మెహిదీపట్నం ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలో బల్కాపూర్ వరద నాల విస్తరణ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. మెహిదీపట్నం చౌరస్తాలో స్కైవాక్ నిర్మాణానికి పూర్తిగా స‌హ‌క‌రిస్తామ‌ని ఆర్మీ అధికారులు స్ప‌ష్టం చేశారు. గోల్కొండ గోల్ఫ్ కోర్స్, డాలర్ హిల్స్ మీదుగా నేక్నాం పూర్ వైపు లింకు రోడ్ల నిర్మాణానికి కూడా సహకరిస్తామని తెలిపారు. ప్రజల అభివృద్ధి కోసం చేపట్టే ఏ కార్యక్రమానికైనా ప్ర‌భుత్వంతో కలిసి పనిచేస్తామని మేజర్ జనరల్ అరుణ్ బృందం మంత్రి కేటీఆర్‌కు తెలిపింది.

అయితే.. ఆర్మీకి సంబంధించిన ప్రతి విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం అత్యంత గౌరవప్రదమైన దృక్పథంతో ముందుకుపోతోంద‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. క‌ల్న‌ల్ సంతోష్ బాబుతో పాటు గాల్వ‌న్ లోయ అమ‌ర‌వీరుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం అండ‌గా నిల‌బ‌డి, దేశానికే ఆద‌ర్శంగా నిలిచామ‌న్నారు. ఈ సందర్భంగా ఆర్మీ జనరల్ మేనేజర్, ఆయన బృందానికి మంత్రి కేటీఆర్ శాలువాలతో స‌త్క‌రించి, గౌరవపూర్వకంగా మేమెంటోలను అందించారు. సమావేశంలో ఆర్మీ ఉన్నతాధికారులతో పాటు జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అధికారులు, పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement