Saturday, September 14, 2024

AP కొల్లేరుకు ..ఆటు పోట్లు… బుడమేరు ఆగదు.. ఉప్పుటేరు తీసుకోదు

అటు, ఇటు ఆక్రమణలతో ఇబ్బందులు
బుడమేరు ఎగదన్ని నందివాడ విలవిల
ఏలూరు, కృష్ణా అధికారులు ఆపసోపాలు
ఏలూరు కైకలూరు మ‌ధ్య‌ రాకపోకలకు ఆటంకం
భయం గుప్పిట్లో కొల్లేరు లంకలు

ఆంధ్రప్రభ స్మార్ట్, న్యూస్ నెట్ వర్క్ :
బుడమేరు దూకుడుతో కొల్లేరు లంక గ్రామాలు వణికిపోతుంటే.. ఇప్పుడు ఉప్పుటేరు ఎగదన్నుతోంది. ఇంకేమంది లంక గ్రామాలు మునకేస్తున్నాయి. బుడమేరు ఉగ్రరూపంతో విజయవాడ అతలాకుతలం కాగా ఆ వరద నీరంతా కొల్లేరుకు చేరి.. లంక గ్రామాలకు వరద పోటు తాకింది. కొల్లేరు నీటిని సముద్రంలో కలిపే ఏకైక మార్గం ఉప్పుటేరు ఆక్రమణల పుణ్యమా? ఎగదన్నుతోంది. ఓ వైపు ఆక్రమణలు, నిర్వహణ లోపాలతో ప్రవాహానికి అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఆ వరద ప్రభావం ఏలూరు జిల్లాలోని ఏలూరు, మండవల్లి, కైకలూరు మండల్లాలోని గ్రామాలపై విరుచుకుపడుతోంది.

- Advertisement -

బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు నుంచి పెద్ద ఎత్తున వరద పొంగటంతో ఇప్పటికే కొల్లేరు నిండిపోయింది. ఎగువన కురిసిన వర్షాలకు 68 మేజర్, మైనర్‌ డ్రెయిన్లు సైతం విరుచుకు పడుతున్నాయి. అంతే కొల్లేరులో డేంజర్ బెల్స్ మెగుతున్నాయి. ప్రమాదకరంగా మారింది. కొల్లేరులో మామూలు రోజుల్లో 10వేల క్యూసెక్కులు మాత్రమే ఉండే నీరు ప్రస్తుతం 25 వేల క్యుసెక్కులకు చేరింది. మరో 10 వేల క్యూసెక్కుల నీరు అదనంగా వస్తోంది. ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని లంక గ్రామాలన్నీ ముంపు బారిన పడుతున్నాయి. ఈ జిల్లాల అధికారులు అప్రమత్తం అయ్యారు.

ప్రమాద ఘంటికలు
కొల్లేరు ఉగ్రరూపం దాల్చడంతో మండవల్లి మండలం పెనుమాకలంక, ఇంగిలిపాకలంక, నందిగామలంక గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. మణుగులూరు, కొవ్వాడలంక గ్రామాల్లోనూ నీరు చేరింది. చినఎడ్లగాడి దగ్గర ఏలూరు-కైకలూరు ప్రధాన రహదారిపై రెండు చోట్ల రెండడుగుల ఎత్తులో ప్రమాదకరంగా నీరు ప్రవహిస్తోంది. ఏలూరు, కైకలూరు మద్య రాకపోకలు స్థంభించాయి.

ఆక్రమణల్లో ఉప్పుటేరు

కొల్లేరు నీరు ఉప్పుటేరు ద్వారా మొగల్తూరు మండలం ములపర్రు దగ్గర సముద్రంలో కలుస్తుంది. కానీ ఉప్పుటేరు ఆక్రమణల చెరలో ఉంది. దాదాపు 5 వేల ఎకరాల వరకు ఆక్రమించుకుని ఆక్వా సాగు చేస్తున్నారు. కొందరు ఇళ్లు కట్టేశారు. ఉప్పుటేరు ఒక్కరోజులో 15 వేల క్యూసెక్కులు సముద్రంలోకి తీసుకువెళుతుంది. ఆక్రమణలతో అది 10 వేల క్యూసెక్కులకు పడిపోయింది. సామర్థ్యానికి మించి నీరు చేరితే కొల్లేరు లంక గ్రామాలు మునిగిపోతున్నాయి. ప్రజలతో పాటు వేలాది మంది రైతులు తీవ్రంగా నష్టాల పాలవుతున్నారు.

ఆక్వా మాఫియా కౌగిట్లో సర్కార్లు
ఉప్పుటేరు నిర్వహణను గత ప్రభుత్వాలు పూర్తిగా గాలికొదిలేశాయి. చివరిగా 12 ఏళ్ల కిందట ఒక్కసారి తవ్వారు. అప్పటి నుంచి ప్రక్షాళన చేయలేదు. గత అయిదేళ్లలో తూడు, గుర్రపుడెక్క కూడా తొలగించలేదు. ఎక్కడ చూసినా కిక్కిసగడ్డి, తూడు, గుర్రపుడెక్కతో ఉప్పుటేరు నిండిపోయింది. దీంతో ప్రవాహ వేగానికి అవరోధాలు ఏర్పడి చుట్టుపక్కల గ్రామాలు మునిగిపోతున్నాయి. అధికారులు, పాలకులు ఇప్పటికైనా ఉప్పుటేరు ఆక్రమణలు తొలగించి సక్రమంగా నిర్వహించకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొల్లేరుకు అటు ఇటు పోటు
ఎగువ వర్షాలతో బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు పొంగిన వరద ఇప్పటికే కొల్లేరు చేరింది. 15 లంక గ్రామాలను వరద పలకరించింది. అయితే, కొల్లేరులో ఆక్రమిత చెరువులు, పెరిగిన తూడు వరద ప్రవాహానికి అడ్డుకట్ట వేయటంతో… బుడమేరు ఎగదన్నుతోంది. గుడివాడ, నందివాడ మండలాల్లోని కొల్లేరు శివారు గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. నందివాడ మండలంలోనూ వేలాది ఎకరాల్లో అక్రమ చెరువులు బుడమేరు ప్రవాహానికి బ్రేక్ వేశాయి. ఇప్పటికే వేలాది మందిని కృష్ణా అధికార యంత్రాంగం పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక ఉప్పుటేరు మొరాయిస్తోంది. ఆక్రమణల అడ్డుతో కొల్లేరులోని లంక గ్రామాల ప్రజలు కంగారెత్తిపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement