ఈరోజు అవతారం మహాసరస్వతీదేవి

యాకుందేదు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా
యావీణా వరదండ మండిత కరా యా శ్వేతపద్మాసన
యా బ్రహ్మాచ్యుత శంకరః ప్రభృతిభిః దేవై సదాపూజితా
సామాంపాతు సరస్వతీ భగవతీ భారతీ నిశ్శేష జాడ్యాపహా !!

దుర్గానవరాత్రులో మూలా నక్షత్రం నాడు అమ్మవారిని సరస్వతి అవతారంలో ఆరాధిస్తారు. దేవతామూర్తులలో చదువు తల్లిగా సరస్వతీ దేవి కొలువబడుతుంది. త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ పట్టపురాణి. సృష్టి కార్యం నిర్వహించటానికి బ్రహ్మకు తోడుగా ఈమెను మహాశక్తి సృజించినట్లుగా దేవీభాగవతం తెలియచేస్తోంది. సకల విద్యలకు, కళలకు, సకల ఙ్ఞానానికి ఈమె చిహ్నం. దేవీ భాగవతం నవమ స్కందంలో సరస్వతీదేవిని గూర్చి వివరించబడినది. హంసవాహినిగా, వీణాపాణిగా ఈమెను కొలుస్తుంటారు. మహాకవుల హృదయకమలమనే వనమును వికసింపచేసే లేత సూర్యుని వంటి కాంతిగ అరుణవర్ణ స్వరూపిణి అయిన సరస్వతి మాతను ఎవరైతే సేవిస్తారో వారు శృంగార రస పూర్ణమైనవి, గంభీరమైనవి, పటుత్వము గలిగిన కవితలతో మనస్సును రంజింపచేయగలరు. సరస్వతీదేవి పాదజము మూగవారిని కూడా మహాకవులుగా చేయును. మూకశంకరులు పుట్టుకతోనే మూగవారు. వారు సరస్వతీ దేవి కరుణవలన ‘‘మూకపంచశతి’’అను గ్రంధమును రచించిరి. తెల్లని పద్మముపై ఆసీనురాలై వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి అభయముద్రతో దర్శనమిస్తూ భక్తులకు ఙ్ఞానజ్యోతిని ప్రసాదిస్తుంది. ఈ రోజు మూలా నక్షత్రము గావటం వలన సరస్వతీ అవతారంలో దర్శనమిస్తుంది. విద్యార్థులచేత అక్షరాభ్యాసం చేయిస్తారు.

శ్రీసరస్వతీ ద్వాదశనామ స్తోత్రము

సరస్వతీ త్వయం దృష్ట్యా వీణా పుస్తకధారిణీ ।
హంస వాహసమాయుక్తా విద్యాదానక రీమమ॥
ప్రథమం భారతీనామ ద్వితీయంచ సరస్వతీ ।
తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహనా ॥
పంచమం జగతివిఖ్యాతాం షష్టం వాగీశ్వరీ తథా ।
కౌమారీ సప్తమం ప్రోక్తా అష్టమం బ్రహ్మచారిణీ ॥
నవమం బుద్ధిధాత్రీచ దశమం వరదాయినీ ।
ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ ॥
బ్రాహ్మీద్వాదశ నామాని త్రిసంధ్యయః పఠేన్నరః ।
సర్వసిద్ధి కరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ ॥
సామేవసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ ॥

సరస్వతీ సోత్రం పారాయణ చేసి విధిగా 14 ప్రదక్షిణలు చేయాలి. ఈ మాతకు తెల్లని లేదా పసుపు రంగు వస్త్రాలు సమర్పించి, బెల్లం అన్నం, ముద్దపప్పు నైవేద్యంగా సమర్పించాలి.

శ్రీశైలంలో ఈ రోజు గజవాహనంపై అమ్మవారు కాళరాత్రిగా దర్శనమిస్తారు.

శుభం భూయాత్‌!!

డా. దేవులపల్లి పద్మజ
విశాఖపట్టణము

Leave a Reply