AP | దేశానికి నేడు బ్లాక్ డే… మైనార్టీలను అణచివేసే కుట్ర : వైఎస్ ష‌ర్మిల‌

  • మత స్వేచ్ఛను హరించడానికే వక్ఫు సవరణ బిల్లు..
  • విప్ జారీతో ముస్లిం ద్రోహిగా చంద్రబాబు…
  • ముస్లింల కు అండగా కాంగ్రెస్ పార్టీ..


(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : ముస్లింలకు రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను హరించడానికే వక్ఫ్ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. దేశంలో మైనార్టీలను అణిచివేసే కుట్రలో భాగంగా ఈ సవరణ బిల్లు వస్తుందని, రాజ్యాంగ వ్యతిరేక బిల్లు ప్రవేశపెడుతున్న నేడు బ్లాక్ డే గా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. దేశ వ్యాప్తంగా ముస్లింల మనోభావాలు దెబ్బతీయడమే నియంత మోడీ అజెండాగా ఉందన్న ఆమె దేశ చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయే ఒక చర్య అన్నారు. ఈ బిల్లు ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప మరొకటి కాదన్నారు. వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం చేయడం కోసమే ఈ పన్నాగం పన్నుతున్నారని, దేవుడికి ఇచ్చిన ఆస్తిని కాజేసి మోడీ బినామీలకు, మోడీ దోస్తులకు వక్ఫ్ ఆస్తులను దారాదత్తం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశంలో 20 కోట్ల మంది ముస్లింలు ఆందోళనలు చేస్తున్నా, వారి వేదన వినకుండా బిల్లును చట్టసభల్లో ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్య విద్రోహ చర్య అని విమర్శించారు.

వారి ఆవేదనను పరిగణనలోకి తీసుకోకపోవడం మోడీ నియంతృత్వ విధానానికి నిదర్శనంగా తెలిపారు. వక్ఫ్ ఆస్తుల పర్యవేక్షణ కలెక్టర్లకు అప్పగించడం, వక్ఫ్ బోర్డులో అన్యమత సభ్యులను నియమించడం, వక్ఫ్ ఆస్తులు 12 ఏళ్ళుగా ఎవరి అధీనంలో ఉంటే వారివే అనడం, 300 ఏళ్ల క్రితం నాటి ఆస్తులకు ఇప్పుడు డాక్యుమెంట్ లు అడగడం, వక్ఫ్ బోర్డుకి భూములు వితరణ చేయాలంటే 5 ఏళ్లు ఇస్లాం ధర్మాన్ని ఆచరించాలని నిబంధన పెట్టడం అంటే ముస్లింల మనోభావాలను దెబ్బతీసే వ్యతిరేక చర్యలేనన్నారు. మైనారిటీల ప్రయోజనాలను దెబ్బతీసే బిల్లుకు టీడీపీ, జనసేన పార్టీలు మద్దతు పలకడం దారుణమ‌ని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అత్యంత శోచనీయం అని, టీడీపీ సెక్యులర్ పార్టీ ముసుగు తొలిగిందన్నారు. చంద్రబాబు మోసం మరోసారి బయటపడిందన్నారు. ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఇచ్చి, వక్ఫ్ ఆస్తులను కాపాడుతామని హామీలు ఇచ్చి, మరోపక్క పార్లమెంట్ లో సవరణ బిల్లుకు మద్దతు పలకడం పచ్చి మోసం కాదా అని ప్రశ్నించారు. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని విప్ జారీచేసిన చంద్రబాబు ఒక ముస్లిం ద్రోహిగా మిగిలిపోయారన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామ‌న్న షర్మిల ముస్లింల పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *