- పరారీలో మరో ఇద్దరు దొంగలు
- 12 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
జన్నారం, మే 7 (ఆంధ్రప్రభ): అంతర్ జిల్లాల్లో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసినట్లు మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ తెలిపారు. మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల కేంద్రంలోని ఉడిపి హోటల్ వద్ద తమ ఏసీపీ, సీఐ ఆదేశానుసారం ఎస్సై, పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా, ప్యాషన్ ప్రో మోటార్ సైకిల్ పై వచ్చిన నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన బత్తుల పరమేష్, రెంకల నరేష్ లను పట్టుకున్నారన్నారు. ఆ ఇద్దరిని విచారించగా, తాము జన్నారం మండలంలోని కలమడుగు గ్రామానికి చెందిన లావుడియ హరికృష్ణతో కలిసి ద్విచక్ర వాహనాలను దొంగలించినట్లు ఒప్పుకున్నారన్నారు.
ఆ ముగ్గురు దొంగలతో పాటు మండలంలోని మురిమడుగు గ్రామానికి చెందిన సంపంగి రమేష్, నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని మల్లాపూర్ కు చెందిన కొట్టే బానేష్ లు గత కొంతకాలంగా జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, జన్నారం తదితర ప్రాంతాల్లో 12 ద్విచక్ర వాహనాలను దొంగలించారని ఆయన చెప్పారు. ఆ వాహనాలను దొంగతనాలకు పాల్పడిన ఐదుగురు నిందితుల్లో బత్తుల రమేష్, రెంకల నరేష్, లావుడియ హరికృష్ణలను అరెస్ట్ చేసినట్లు ఆయన చెప్పారు. మిగతా ఇద్దరు దొంగలు సంపంగి రమేష్ జైల్లో ఉండగా, కొట్టే బానేష్ పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు.
ఆ నిందితుల నుంచి 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు, ఆ వాహనాల విలువ రూ.3 లక్షల60వేలు ఉంటుందని ఆయన వివరించారు. మంచిర్యాల ఎసీపీ ప్రకాష్, లక్సేట్టిపేట సీఐ అల్లం నరేందర్ ఆధ్వర్యంలో జన్నారం ఎస్సై గుండేటి రాజవర్ధన్, హెడ్ కానిస్టేబుళ్లు బి.తుకారం, ఎం.డి గౌస్, కానిస్టేబుళ్లు సురేష్ నాయక్, లక్కాకుల వెంకటేష్ లు ఆ దొంగలను చాకచక్యంగా పట్టుకున్నారని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా వారందరినీ డీసీపీ అభినందిస్తూ, నగదు పారితోషికం అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.