హైదరాబాద్ : ఆధునిక క్రీడలు ఎన్ని పుట్టుకొచ్చినా కుస్తీ పోటీల ( రెజ్లింగ్) కు మాత్రం ఆదరణ తగ్గలేదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గత మూడు రోజుల నుండి ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న 3వ మహావీర్ తెలంగాణ కేసరి కుస్తీ పోటీలు గత రాత్రి ముగిశాయి. ఈ కార్యక్రమానికి మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలు హాజరై టైటిల్ విన్నర్ మొదటి విజేతగా నిలిచిన హైదరాబాద్ కు చెందిన ముస్తఫా బిన్ అలీ, రెండో విజేతగా నిలిచిన సాయి కిరణ్, కేవల్ యాదవ్ లకు బహుమతులతో పాటు ప్రైజ్ మనీ ని అందజేశారు. విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ… 5 వేల సంవత్సరాల నుండి ఈ క్రీడ ఉన్నదని చరిత్ర ద్వారా తెలుస్తుందని పేర్కొన్నారు. ఈ పోటీల్లో వివిధ కేటగిరీల్లో 30రాష్ట్రాలకు చెందిన 440మంది పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీసీ సంఘం నాయకులు చిన శ్రీశైలం యాదవ్, యువ నాయకులు నవీన్ యాదవ్, ముఠా జైసింహ, నిర్వాహకులు మెట్టు శివ, తదితరులు పాల్గొన్నారు.