Thailand Open | మహిళా షట్లర్ల జోరు..

  • తొలి రౌండ్‌లోనే బోల్తాకొట్టిన లక్ష్యసేన్‌, రజావత్‌

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత మహిళా షట్లర్లు శుభారంభం చేయగా.. పురుషుల విభాగంలో మాత్రం భారీ నిరాశ ఎదురైంది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌ వేదికగా జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఆకర్షి కశ్యప్‌, ఉన్నతి హూడా, మాళవిక బన్సోద్‌ విజయాలు సాధించారు.

మరోవైపు పురుషుల విభాగం సింగిల్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌తో పాటు ప్రియాంషు రజావత్‌ తొలి రౌండ్‌లోనే ఓడి టోర్నీ నుంచి వైదొలిగారు.

ఈరోజు (బుధవారం) జరిగిన మహిళల సింగిల్స్‌ మొదటి రౌండ్‌లో ఆకర్షి కశ్యప్‌ 21-16, 22-20, 22-20 తేడాతో జపాన్‌కు చెందిన కౌరు సుగియామాపై అద్భుతంగా పోరాడి గెలిచింది.

మరో మ్యాచ్‌లో భారత యువ స్టార్‌ షట్లర్‌ మాళవిక బన్సోద్‌ 21-12, 13-21, 21-17 తేడాతో టుర్కి క్రీడాకారిణి నెస్లిహాన్‌ ఆరిన్‌పై చెమటోడ్చి నెగ్గింది.

ఉన్నతి హుడా కూడా 21-14, 18-21, 23-21 మూడు గేమ్‌ల మ్యాచ్‌లో థమోన్‌వాన్‌ నితిటిక్‌రాయ్‌ (థాయ్‌లాండ్‌)ను ఓడించి టోర్నీలో ముందంజ వేసింది.

ఇతర మహిళల సింగిల్స్‌ మ్యాచుల్లో రక్షిత శ్రీ సంతోష్‌ రామ్‌రాజ్‌ 18-21, 7-21 తేడాతో 8వ సీడ్‌ యియో జియా మిన్‌ (సింగపూర్‌) చేతిలో… అణుపమ ఉపాద్యాయ 11-21, 9-21తో స్థానికి స్టార్‌ షట్లర్‌ రాచనోక్‌ ఇంటనోన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓటములు చవిచూశారు.

తొలి రౌండ్‌లోనే ఇంటికి..

భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో తీవ్రంగా నిరాశ పరిచాడు. పురుషుల సింగిల్స్‌ మొదటి రౌండ్‌లో లక్ష్యసేన్‌ 18-21, 21-9, 17-21 తేడాతో ఐరిష్‌ ప్లేయర్‌, నాహత్‌ ఎన్‌గుయేన్‌ చేతిలో పోరాడి ఓడాడు.

మరో మ్యాచ్‌లో ప్రియాంషు రజావత్‌ కూడా 13-21, 21-17, 16-21తో ఐవీ ఫర్హాన్‌ (ఇండోనేషియా) షట్లర్‌ చేతిలో ఓడి టోర్నీ నుంచి వైదొలిగాడు.

ప్రి క్వార్టర్స్‌లో గాయత్రి జోడీ..

మహిళల డబుల్స్‌లో భారత నం.1 గాయత్రి గోపీచంద్‌-త్రిష జాలీ జోడీ ప్రి క్వార్టర్‌ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. గాయత్రి-త్రిష జోడీ 21-15, 21-13 తేడాతో మలేషియాకు చెందిన ఒంగ్‌ జిన్‌ ఈ-కార్మెన్‌ టింగ్‌ జంటను వరుస గేముల్లో చిత్తు చేసి టోర్నీలో శుభారంభం చేసింది.

Leave a Reply