ప్రజలకు మెరుగైన పోలీసు సేవలందించేందుకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ చేపట్టిన వినూత్న కార్యక్రమం “ఎస్హెచ్ఓ భేటీ ” శనివారం పునః ప్రారంభమైంది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా బందోబస్తు చేసేందుకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు.
ప్రజలకు నాణ్యమైన సేవలను అందించడమే కాకుండా, పోలీసు వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని పెంపొందించడం ఆయన ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా శనివారం నాడు డిజిపి కార్యాలయంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి దాదాపు 36 మంది పోలీసు అధికారులు(ఇన్స్పెక్టర్లు/ఎస్సైలు) శిక్షణకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా డిజిపి డాక్టర్ జితేందర్ మాట్లాడుతూ…. పోలీసు వ్యవస్థలో స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. పోలీస్ శాఖ ప్రతిష్ట స్టేషన్ హౌస్ ఆఫీసర్ల పనితీరుపై ఆధారపడి ఉంటుందన్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు ఎస్ హెచ్ ఓ లు కృషి చేయాలి అన్నారు.
రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుండి కొంతమంది పోలీసు అధికారులను ఎంపిక చేసి, వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు.. దశలవారీగా ఈ శిక్షణ రాష్ట్రంలోని పోలీసు అధికారులు అందరికీ ఇవ్వాలని డిజిపి నిర్ణయించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో, డీజీపీ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ స్వయంగా పాల్గొని, విధానాలు, ముఖ్యమైన అంశాలపై అధికారులతో ప్రత్యక్షంగా చర్చించారు.
డిజిపి కార్యాలయంలో జరిగినఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ(శాంతి భద్రతలు) మహేష్ ఎం భగవత్ ఐపీఎస్, శాంతి భద్రతల ఏఐజి రమణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.