రాజకీయ మిత్రత్వం వేరు, ఇప్పటి సమస్య వేరు
హెచ్సీయూ భూముల విషయంపై స్పందించిన నారాయణ
భూములు అమ్మే ప్రయత్నం చేస్తే ఊరుకోబోము
మీడియాతో సీపీఐ నేత సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రాజకీయ మిత్రత్వం వేరు.. ప్రభుత్వం తాము చెప్పింది వింటుందా? అని సీపీఐ జాతీయ సహాయ కార్యదర్శి నారాయణ అన్నారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాజకీయాలు మిత్ర బంధాలు వేరు.. ప్రస్తుత హెచ్సీయూ భూముల సమస్య వేరు అని చెప్పారు. రాజకీయాల్లో ఎవరికి ఎవరు శాశ్వత మిత్రులు కాదు.. శాశ్వత శత్రువులు కాదని గుర్తు చేశారు. ఇందిరాగాంధీ హయాంలో హెచ్సీయూకు భూములు కేటాయించారని వివరించారు. భూముల ధరలు పెరగడంతో అందరి కన్ను సెంట్రల్ యూనివర్సిటీ భూముల పై పడిందన్నారు.
ఆ భూములను కేర్ ఆస్పత్రి యాజమాన్యం అడిగింది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి కేర్ ఆస్పత్రి యాజమాన్యం కూడా ఆసుపత్రి కోసం ఇవ్వాలని కోరిందని నారాయణ తెలిపారు. అయితే విద్య వ్యవస్థకే ఆ భూములని వినియోగించాలని అప్పట్లో తాము కోరినట్లు గుర్తు చేశారు. విద్య వ్యవస్థ విస్తృతికి ఈ భూములను ఉపయోగించాలని కోరారు. ప్రభుత్వ భూములు అమ్మ కూడదన్నారు. ప్రభుత్వం హెచ్సీయూ భూముల విషయంలో పునరాలోచించాలని, వెంటనే ఈ భూముల జోలికి పోమని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
భూములు అమ్మే ప్రయత్నం చేస్తే ఊరుకుంటామా?
యూనివర్సిటీ భూములను వ్యాపార వస్తువుగా చూడొద్దని నారాయణ అన్నారు. విద్యార్థులను కొడుతుంటే.. భూముల అమ్మే ప్రయత్నం చేస్తే ఊరుకుంటామా? అని అన్నారు. వక్ఫ్ బిల్ పై నారాయణ మాట్లాడుతూ.. వక్ఫ్ బిల్లుకు ఆమోదం రావడంతో లౌకిక వ్యవస్థకు చీకటి రోజులు వచ్చాయని అన్నారు. రెండు సభలను బుల్డోజ్ చేశారని, రాజ్యాంగానికి ఏం విలువ ఉందని మండిపడ్డారు. పార్లమెంటులో బిల్లు అయినప్పటికీ కూడా బయట మా ఆందోళనలు కొనసాగుతాయని అన్నారు.