శాసనమండలిలో పదవీ కాలం పూర్తి చేసుకున్న సభ్యులను ఘనంగా సత్కరించారు. శాసనమండలి ఆవరణలో జరిగిన కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పదవీ కాలం పూర్తి చేసుకున్న తొమ్మిది మంది సభ్యులను సత్కరించారు.
మార్చి 29వ తేదీతో పదవీ కాలం ముగుస్తున్న టీ.జీవన్ రెడ్డి , కూర రఘోత్తమ రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, యెగ్గె మల్లేశం, మిర్జా రియాజుల్ హుస్సేన్ ఎఫెండీతో పాటు మే 1 వ తేదీతో పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న ఎంఎస్ ప్రభాకర్ రావుని సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్, మంత్రులు డి. శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, పలువురు శాసనమండలి సభ్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.








