T20I squad | ఫామ్ బాగాలేక కాదు.. ఫ్లైట్ లో సీటు ఖాళీ లేకనే దింపేశారా… !!

T20I squad | ఫామ్ బాగాలేక కాదు.. ఫ్లైట్ లో సీటు ఖాళీ లేకనే దింపేశారా… !!
ఆంధ్రప్రభ : 2026 T20I ప్రపంచకప్కు సంబంధించి భారత సెలెక్టర్లు ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మీద వేటు పడటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే గిల్ను జట్టులోంచి తప్పించడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. గిల్ను పేలవ ఫామ్ కారణంగా పక్కన పెట్టలేదని, కేవలం వరల్డ్కప్కు వెళ్లే ఫ్లైట్లో సీటు ఖాళీ లేకపోవడంతోనే దింపేశారంటూ నెటిజన్లు వెరైటీగా స్పందిస్తూ జోకులు పేల్చుతున్నారు.
గిల్ ఉద్వాసనకు గణాంకాల పరంగా చూస్తే గత 15 ఇన్నింగ్స్లలో కేవలం 137.26 స్ట్రైక్ రేట్తో 291 పరుగులు మాత్రమే చేయడం ప్రధాన బలహీనతగా కనిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికాపై 5 ఇన్నింగ్స్లలో కేవలం 40 పరుగులే (స్కోర్లు: 0, 8, 4, 0, 28) చేయడం గమనార్హం. ఈ పేలవ ప్రదర్శనే గిల్ ఉద్వాసనకు ప్రధాన బలహీనతగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆసియా కప్లో పాకిస్థాన్పై చేసిన 47 పరుగులు మినహా గిల్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. సంజూ శాంసన్ను కాదని గిల్ను వైస్ కెప్టెన్గా ప్రమోట్ చేసినప్పటికీ యాజమాన్యం నమ్మకాన్ని శుభమన్ గిల్ నిలబెట్టుకోలేకపోయాడు.
Cricket | New Team| అయ్యో గిల్.. షాకిచ్చారుగా..
అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, గిల్ను పక్కన పెట్టడానికి ఫామ్ కారణం కాదని, జట్టు కూర్పులో భాగంగా టాప్ ఆర్డర్లో ఒక వికెట్ కీపర్ ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, వరల్డ్ కప్ గెలవడానికి అవసరమైన కాంబినేషన్ల కోసమే ఈ మార్పు చేశామని వివరించారు.

ఇక తన ఫామ్పై తానే సెటైర్లు వేసుకున్నాడు కెప్టెన్ సూర్య. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో పేలవ బ్యాటింగ్తో ఇబ్బంది పడిన టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తన ప్రదర్శనపై తానే వ్యంగ్యంగా స్పందించాడు. ‘బ్యాటర్ సూర్య తప్పిపోయాడు, కానీ త్వరలోనే బలంగా తిరిగి వస్తాడు’ అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తూ అభిమానులను నవ్వులు పూయించాడు.
T20I | టాపార్డర్ లో చిచ్చరపిడుగు..
ఇక వరల్డ్ కప్ కి గిల్ స్థానంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ తరఫున 517 పరుగులు చేసి విధ్వంసం సృష్టించిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. టాప్ ఆర్డర్లో ఇషాన్ రావడంతో జట్టులో రింకూ సింగ్ కి చోటు దొరికింది. అయితే ఈ వ్యూహాత్మక మార్పుల వల్ల గత సిరీస్లలో నంబర్ వన్ కీపర్గా ఉన్న జితేష్ శర్మ జట్టులో చోటు కోల్పోయాడు.

గిల్ గైర్హాజరీలో అక్షర్ పటేల్ను వైస్ కెప్టెన్గా నియమించారు. జట్టులోని ఇతర ఎంపికలు ఆశించిన రీతిలోనే ఉన్నాయి. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని నడిపించనుండగా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ప్రధాన స్పిన్నర్లుగా ఎంపికయ్యారు.

అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ స్పిన్ ఆల్రౌండర్లుగా, హార్దిక్ పాండ్య, శివమ్ దూబే పేస్ ఆల్రౌండర్లుగా ఎంపికయ్యారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రింకూ సింగ్ మిడిల్ ఆర్డర్ను బలోపేతం చేయనుండగా, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ఓపెనర్లుగా బాధ్యతలు చేపడతారు. ఇదే జట్టు న్యూజిలాండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో కూడా ఆడనుంది.
టీ20 ప్రపంచ కప్ కు టీమిండాయా జట్టు ఇదే..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ సమ్సన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం డూబే, అక్సర్ పటేల్ (వైస్-కెప్టెన్), రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, కులదీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషాన్ (వికెట్ కీపర్)
T20I | డిఫెండింగ్ ఛాంపియన్ డ్రీమ్ ఇదే !!
2026 ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న ఈ ప్రపంచకప్లో డిఫెండింగ్ ఛాంపియన్గా భారత్ బరిలోకి దిగుతోంది. శ్రీలంక టీ20 ప్రపంచకప్కు ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండోసారి (గతంలో 2012లో ఇచ్చింది), భారత్ కూడా గతంలో 2016లో ప్రపంచ కప్ కు ఆతిథ్య ఇవ్వగా.. రెండోసారి ఈ బాధ్యతను నిర్వర్తిస్తోంది.
గ్రూప్-Aలో పాకిస్థాన్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియాతో కలిసి భారత్ తలపడనుంది. టీమిండియా తన తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 7న ముంబైలో అమెరికాతో ఆడుతుంది. ఫిబ్రవరి 12న ఢిల్లీలో నమీబియాతో, 15న కొలంబోలో పాకిస్థాన్తో, 18న అహ్మదాబాద్లో నెదర్లాండ్స్తో భారత్ తలపడనుంది.

ఫిబ్రవరి 20 వరకు 40 గ్రూప్ మ్యాచ్లు జరగనుండగా, నాలుగు గ్రూపులలోని టాప్ రెండు జట్లు ఫిబ్రవరి 21 నుండి ప్రారంభమయ్యే సూపర్ ఎయిట్స్కు చేరుకుంటాయి. వరుసగా రెండోసారి టైటిల్ను నిలబెట్టుకుని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచకప్కు ముందు జనవరి 21 నుండి న్యూజిలాండ్తో జరిగే సిరీస్ జట్టు సన్నద్ధతకు కీలకం కానుంది.
