- టీడీపీ, వైసీపీ మధ్య బాహాబాహీ
- ఇరువర్గాల రాళ్లదాడి
- పలు వాహనాల ధ్వంసం
(ఆంధ్రప్రభ, తాడిపత్రి) : వైసీపీ నేత ఫయాజ్ భాష అక్రమ కట్టడాల కూల్చివేతకు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ అధికారులు ప్రయత్నించగా.. వైసీపీ వర్గాలు ప్రతిఘటించడంతో ఇరువర్గీయుల మధ్య ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. దీంతో అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్గా మారింది.
నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం…
వైసీపీ నేత ఫయాజ్ భాష నూతనంగా నిర్మించిన భవనం మున్సిపాలిటీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని పలుమార్లు మున్సిపాలిటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. వైసీపీ నేత ఫయాజ్ బాషా నూతన భవనం నిర్మాణానికి ఐదు సెంట్లకు మాత్రమే పర్మిషన్ తీసుకుని 12 సెంట్లలో నూతన భవనం నిర్మించారని మున్సిపాలిటీ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో అక్రమ భవన నిర్మాణాన్ని కూల్చేందుకు మున్సిపాలిటీ అధికారులు, కౌన్సిలర్లు వైసీపీ నేత పయాజ్ భాషా ఇంటికి చేరుకున్నారు. వీరిని వైసీపీ నేత ఫయాజ్ భాషా తన అనుచరులతో అడ్డుకున్నారు. ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుందేమోనని ముందు జాగ్రత్త చర్యగా తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆధ్వర్యంలో ఇరువురి మధ్య చర్చలు జరిపారు.
ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి…
తనకు కోర్టు అనుమతులు ఉన్నాయని పోలీసులకు మున్సిపాలిటీ అధికారులకు వైసీపీ నేత తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో పెద్ద ఎత్తున వైసీపీ నేత ఫయాజ్ బాషా ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ శ్రేణులు వైసీపీ నేత ఇంటిపై రాళ్ల దాడికి దిగారు. ఈ రాళ్ల దాడిలో ఇంటి అద్దాలు, సీసీ కెమెరాలు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఏ ఎస్ పి రోహిత్ కుమార్ చౌదరి పోలీసు బలగాలను రప్పించి వైసీపీ, టీడీపీ శ్రేణులను చెదరగొట్టడంతో రాళ్లదాడి అదుపులోకి వచ్చింది. జిల్లా ఎస్పీ జగదీష్ తాడిపత్రికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య రాళ్లదాడి జరగడంతో అనంతపురం రేంజ్ డిఐజి షి మోషి, ఎస్పీ జగదీష్, ఏఆర్ ఏఎస్ పి తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ లో మకాం వేశారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా తాడిపత్రిలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.