subsidy | ఆన్ లైన్ మోసాలు అరికట్టండి…

subsidy | ఆన్ లైన్ మోసాలు అరికట్టండి…

బ్యాంకు అధికారులను ఆదేశించిన ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా

subsidy | నరసరావు పేట, ఆంధ్రప్రభ : మ్యూల్ అకౌంట్ల ద్వారా జరుగుతున్న ఆన్ లైన్ మోసాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని బ్యాంకు అధికారులను ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు. కాలేజీ విద్యార్థుల బ్యాంకు అకౌంట్లకు డబ్బులు చెల్లించి మరీ మోసాలకు వాడుతున్న విధానాన్ని నిరోధించేందుకు కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

స్థానిక కలెక్టరేట్ లోని ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలునందు బ్యాంకు ప్రతినిథులతో ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్యాంకులు నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాల ద్వారా శిక్షణ పొందిన వారిలో 80 శాతం మందికి ఉపాధి లేదా వ్యాపార అవకాశాలు దక్కేలా చూడాలన్నారు. సూర్యఘర్ పథకం కింద సబ్సిడీ రుణాల వితరణ వేగవంతం చేయాలన్నారు. రికవరీ సమస్యలున్న డ్వాక్రా రుణాల అకౌంట్ల వివరాలు డీఆర్డీఏకు అందించాలన్నారు.

విద్యార్థులకు హాస్టల్ ఫీజులు, ఇతర ఖర్చుల వినియోగానికి తక్కువ మొత్తంలో విద్యా రుణాలు అందించాలన్నారు. విద్యా రుణాలపై కళాశాలల్లో అవగాహన కల్పించాలన్నారు. రుణ వితరణ లక్ష్యాలు చేరుకోని బ్యాంకుల నుంచి వివరణ ఇవ్వాల్సివుంటుందన్నారు. జూన్-జులై నాటికి కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు అందించి పంట రుణ వితరణ జరిగేలా చూడాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు.

పశు పెంపకం దారులకు కేవలం నాలుగు శాతం వడ్డీతో ఒక్కో పశువుపై రూ.50,000 నుంచి రూ.లక్ష వరకూ అందించే రుణాలపై అవగాహన కల్పించాలన్నారు. మార్చి మూడో వారంలోగా క్లస్టర్ విధానంలో మండలాల వారీగా ఏర్పాటు చేసిన క్లస్టర్ల అభివృద్ధికి రుణాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్ పర్సన్ మక్కెన మల్లికార్జున రావు, ఎల్డీఎం రామ్ ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు, డీఆర్డీఏ పీడీ ఝాన్సీ రాణి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply