Srisailam | భ్రమరాంబిక క్షేత్రంలో.. ఉగాది మహోత్సవాలకు శ్రీకారం…

  • లోకాకళ్యాణార్థమై రుద్రహోమం, చండీహోమం….
  • అమ్మవారికి విశేషాకుంకుమార్చనలు, నవావరణార్చనలు…
  • రాత్రి స్వామివార్ల కు భృంగి వాహనసేవ, అమ్మవారికి మహాలక్ష్మి అలంకారం సేవలు…
  • ఈనెల 30వ తేది ఉగాది పంచాంగం…


నంద్యాల బ్యూరో, మార్చి 27 (ఆంధ్రప్రభ) : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాలకు గురువారం కార్యనిర్వాహణాధికారి వివిధ కార్యక్రమాలకు వివిధ పూజలకు శ్రీకారం చుట్టారు. భూమండలానికి నాభిస్థానమైన శ్రీభ్రమరాంభ మల్లికార్జున స్వామివార్ల సన్నిధానం శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలకు శాస్రోక్త పూజలతో శ్రీకారం చుట్టారు. కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు దంపతులు, స్థానాచార్యు లు, ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, వేదపండితులు యాగశాల ప్రవేశం చేసి విఘ్నేశ్వర పూజ నిర్వహించి ఉగాది మహోత్సవాల ప్రత్యేక పూజలను వేదమంత్రోచ్ఛారణలతో మంగళవాయిద్యాల నడుమ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తదుపరి శివసంకల్పం, గణపతి పూజ, పుణ్యాహవచనం, చండీశ్వర పూజ, కంకణం పూజ, కంకణం ధారణ, అఖండస్థాపన, వాస్తుపూజ, వాస్తుహోమం, నవగ్రహ మండపారాధన, పంచావరణార్చన, రుద్రకళశస్థాపన మూలమంత్ర అనుష్టాన కార్యక్రమాలు నిర్వహించారు.

మల్లికార్జున స్వామి భ్రమరాంబిక అమ్మవార్లకు దీక్షావస్త్రాలకు, కంకణాలకు విశేషపూజలు చేసిన అనంతరం వేదపండితులు, అర్చకులు, భజంత్రీలకు సంబంధిత ఆలయ సిబ్బందికి ప్రధానార్చకులు దీక్షావస్త్రాలను అందజేశారు. ఐదు రోజుల పాటు విశేష పూజలతో, ప్రత్యేక వాహన సేవలు, అమ్మవారికి అలంకారసేవలు నిర్వహించి అత్యంత వైభవంగా గ్రామోత్సవం నిర్వహిస్తామని కార్యనిర్వహణాధికారి తెలిపారు. ఉగాది మహోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో ఉభయ దేవాలయాల్లో స్వామివార్లకు అనునిత్యం జరిగే కైంకర్యాలన్నీ యధావిధిగా జరుగుతాయని, లోకాకళ్యాణార్ధం స్వామివార్లకు రుద్రహోమం, చండీహోమం, అదేవిధంగా అమ్మవారికి విశేష కుంకుమార్చన, నవావరణార్చనలు, నిర్వహించి రాత్రి స్వామివార్ల కు భృంగి వాహన సేవ, అమ్మవారికి మహాలక్ష్మి అలంకారం సేవ జరిపి క్షేత్రమాడవిధులలో గ్రామోత్సవం నిర్వహించబడుతుందని తెలిపారు.

ఈ గ్రామోత్సవంలో పలు జానపదకళారూపాల ప్రదర్శన నిర్వహిస్తామని ఉత్సవాల ఐదు రోజులు స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు, అలంకార సేవలు జరుగుతాయని కార్యనిర్వహణాధికారి పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం స్వామి అమ్మవార్లకు భృంగి వాహనం కార్యక్రమాలతో పాటు ఉత్సవమూర్తుల ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంటుందన్నారు. అమ్మవారి ఉత్సవమూర్తి మహాలక్ష్మి అలంకారం బ్రహ్మోత్సవ కార్యక్రమం జరుగుతుందన్నారు. చతుర్భుజాలు గల ఈ దేవి అమ్మవారి రెండు చేతులతో పద్మాలను క్రింది చేతులతో కుడి వైపున అభయ హస్తం ఎడమవైపు వరముద్రతో దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు. అదేవిధంగా గ్రామోత్సవంలో నాదస్వరం, కోలాటం చెక్కభజన, రాజభటుల వేషాలు, కేరళ చండీ నేతల వేషాలు, కొమ్ముకొయ్య నృత్యము, వీరభద్ర డోలు, కనిత, కర్ణాటక డోలు కాలిక నృత్యం, జానపద పగటి వేషాలు, నృత్యం, చిడతల శంఖము, పిల్లనగ్రోవి, డోలు విన్యాసం గిరిజన చెంచు నృత్యం తదితర బ్రహ్మోత్సవాల కళారూపాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

కన్నడిగులకు ప్రత్యేక ఏర్పాట్లు…
ఉగాది మహోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలోని భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానంనకు తరలివచ్చిన కన్నడిగుల కోసం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లలో చేపట్టింది. తాగునీటి వసతితో పాటు, చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. కర్ణాటక మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తుల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. వారు దేవుని దర్శనార్థం కోసం క్యూలైన్ లో నిల్చున్న భక్తులకు ఆహార పొట్లాలను తాగునీటి సౌకర్యాలను అందిస్తున్నారు. ఏమాత్రం భక్తులకు ఇబ్బంది కలిగినా అక్కడున్నటువంటి కరసేవకుల ద్వారా సమాచారం అందిస్తే వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నట్టు కార్యనిర్వాహణాధికారి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *