Monday, October 14, 2024

Olympics | టెన్నిస్ పోటీ నుంచి తప్పుకున్న సిన్న‌ర్..

పురుషుల నంబర్‌ వన్‌ టెన్నిస్‌ క్రీడాకారుడు జన్నిక్‌ సిన్నర్‌ పారిస్‌ ఒలింపిక్స్‌ నుంచి తప్పుకున్నాడు. అస్వస్థత (టాన్సిల్స్‌) కారణంగా విశ్వ క్రీడల బరి నుంచి వైదొలుగుతున్నట్లు సిన్నర్‌ ప్రకటించాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం కోల్పోయినందుకు బాధగా ఉందని, ఇంటి నుంచే ఇటలీ అథ్లెట్లను సపోర్ట్‌ చేస్తానని సిన్నర్‌ తెలిపాడు.

ఒలింపిక్స్‌లో సిన్నర్‌ సింగిల్స్‌తో పాటు డబుల్స్‌లో పోటీ పడాల్సి ఉండింది. సిన్నర్‌ వైదొలగడంతో అతని పార్ట్‌నర్‌ లొరెంజో ముసెట్టి మరో భాగస్వామిని వెతుక్కోవాల్సి వచ్చింది. సింగిల్స్‌ పోటీల నుంచి సిన్నర్‌ తప్పుకోవడంతో ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా) టాప్‌ సీడ్‌ ఆటగాడిగా బరిలో నిలుస్తాడు.

ఒలింపిక్స్‌ డ్రా ఇవాళ (జులై 25) ప్రకటించే అవకాశం ఉంది. జులై 27 నుంచి తొలి రౌండ్‌ మ్యాచ్‌లు మొదలవుతాయి. ఆగస్ట్‌ 4న అన్ని విభాగాల్లో గోల్డ్‌ మెడల్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. కాగా, పారిస్‌ ఒలింపిక్స్‌ టెన్నిస్‌ క్రీడలో భారత్‌ రెండు విభాగాల్లో పోటీపడనుంది. పురుషుల సింగిల్స్‌లో సుమిత్‌ నగాల్‌.. పురుషుల డబుల్స్‌లో రోహన్‌ బోపన్న-శ్రీరామ్‌ బాలాజీ జోడీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement