Thursday, September 12, 2024

BCCI | ఫిట్ గా ఉన్న‌వాళ్లంతా దేశ‌వాళీ టోర్నిలు ఆడాల్సిందే..

క్రికెటర్ల ఫిట్‌నెస్‌, ఫామ్‌పై బీసీసీఐ దృష్టిసారించింది. గాయాలపాలై ఆటకు దూరంగా ఉన్నవారు మళ్లీ జాతీయజట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్‌ ఆడాలని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జైషా వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోసారి ఇదే విషయంపై స్పష్టత ఇచ్చారు. తమ ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాలంటే డొమిస్టిక్‌ అత్యుత్తమ వేదికగా జైషా పేర్కొన్నారు. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా వంటి వారికి మాత్రమే కొన్ని మినహాయింపులు ఉంటాయని వెల్లడించారు. వారిని కూడా ఆడాలని కోరడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు.

”మేం కాస్త స్ట్రిక్ట్‌గా ఉందామని నిర్ణయించుకున్నాం. రెండేళ్ల కిందట రవీంద్ర జడేజా గాయపడ్డాడు. ఆ తర్వాత కోలుకున్నాడు. అప్పుడు జడ్డూను దేశవాళీలో ఆడమని నేనే కోరా. ఇప్పుడు ఇది తప్పనిసరి చేశాం. ఎవరైనా గాయాలకు గురై.. విరామం తీసుకొని మళ్లీ జాతీయజట్టులోకి రావాలని భావిస్తే మాత్రం తమ ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాలి.

అందుకు దేశవాళీ క్రికెట్‌ను వేదికగా చేసుకోవాలి. ఈ విషయంలో విరాట్, రోహిత్ వంటి టాప్‌ క్రికెటర్లకు అన్వయించలేం. అక్కడ ఆడుతూ.. గాయపడితే జట్టుకు చాలా నష్టం. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలోనూ అగ్రశ్రేణి క్రికెటర్లు ఆడటం మనం చూడలేదు. మన ప్లేయర్లకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ, గాయపడిన వారి పరిస్థితి వేరు. వారి ఫిట్‌నెస్‌ కోసం ఇందులో ఆడాలని మరోసారి చెబుతున్నాం” అని జైషా తెలిపారు.

సెప్టెంబర్ 5 నుంచి దులీప్‌ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఆ ముగ్గురు మినహా దాదాపు అందరూ ఈ టోర్నీలో ఆడేందుకు సిద్ధమవుతున్నారు. శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్‌ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ కెప్లెన్లుగా వ్యవహరిస్తారు. సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయిన ఇషాన్‌ కిషన్‌ కూడా ఇందులో ఆడనున్నాడు. ఇప్పటికే అతడు బుచ్చిబాబు టోర్నీలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఝార్ఖండ్‌కు ఆడుతున్న అతడు.. మధ్యప్రదేశ్‌పై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement