శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం : లోక కల్యాణం కోసం దేవస్థానం 2 సెప్టెంబర్ రోజున ఆలయప్రాంగణంలోని నందీశ్వర స్వామికి శనగల బసవన్న స్వామివారికి విశేషార్చనలను నిర్వహించారు. ప్రతి మంగళవారం, త్రయోదశి రోజున దేవస్థాన సేవగా అనగా సర్కారీసేవగా ఈ కైంకర్యం జరిపించబడుతోంది.
ప్రదోష కాలంలో అనగా, సాయం సంధ్యా సమయంలో ఈ విశేషపూజలు నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతోంది. ఈ విశేషార్చనలో ముందుగా లోక క్షేమాన్ని కాంక్షిస్తూ దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరిత్యాలు సంభవించకుండా, సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి, వారికి అకాల మరణాలు సంభవించకుండా ఉండాలని, దేశంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, జనులందరూ సుఖ-శాంతులతో విలసిల్లాలని అర్చకస్వాములు, వేదపండితులు సంకల్పాన్ని చెప్పడం జరుగుతుంది.
అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహా గణపతి పూజను జరిపించబడుతుంది. ఆ తరువాత నందీశ్వరస్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలతోనూ, పలోదకాలతో హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం మరియు మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం నిర్వహిస్తారు. తరువాత సందీశ్వరస్వామికి అన్నాభిషేకం నిర్వహించబడుతుంది.
వృషభసూక్తం మొదలైన వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా ఈ విశేషాభిషేకాన్ని చేయడం జరుగుతుంది. తరువాత సందీశ్వరస్వామివారికి నూతన వస్త్ర సమర్పణ, విశేష పుష్పార్చనలను చేస్తారు. అనంతరం నానబెట్టిన శనగలను నందీశ్వర స్వామికి సమర్పించడం జరుగుతుంది. చివరగా స్వామికి నివేదన సమర్పించబడుతుంది.




