ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసమే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు, కోల్ బెల్ట్ ప్రాంత యువత ఈ శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. ఆదివారం భూపాలపల్లిలోని సింగరేణి ఏరియా వర్క్ షాప్ ఎదురుగా ఉన్న ఎస్.డి.టి.సి ఆవరణలో ఎమ్మెల్యే జీఎస్సార్ ప్రత్యేక చొరవతో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ భూపాలపల్లి ఏరియా వారి సహకారంతో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ను సింగరేణి సి అండ్ ఎండి ఎన్.బలరాంతో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపే నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ట్రైనింగ్ సెంటర్ ద్వారా చదువుకున్న నిరుద్యోగ యువతకు శిక్షణను ఇస్తున్నట్టు తెలిపారు. ఈ ట్రైనింగ్ సెంటర్ లో మొత్తం 38రకాల కోర్సుల్లో అభ్యర్థులకు శిక్షణ ఉంటుందని, శిక్షణ సమయంలో అభ్యర్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందిస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగ సమస్యను ఎదుర్కొనేందుకు యువతకు వివిధ రంగాల్లో స్కిల్ యూనివర్సిటీ శిక్షణ ఇస్తుందని, స్కిల్ డెవలప్మెంట్కి సీఎం రేవంత్ రెడ్డి అధికంగా ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. దేశంలో నిరుద్యోగమే పెద్ద సమస్యగా మారిందని, ఉద్యోగాలు లేక యువత మాదక ద్రవ్యాలకు బానిస అవుతుందన్నారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో కష్టపడి చదివి డిగ్రీ పట్టాలు పొంది బయటకు వచ్చిన యువతకు సరైన స్కిల్స్ ఉండటం లేదని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా యువత ఉద్యోగాలకి అవసరమైన నైపుణ్యాలను నేర్చుకుని ఉద్యోగాల్లో స్థిరపడాలని కోరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేకు సింగరేణి అధికారులు శాలువా కప్పి సన్మానం చేశారు. అంతకుముందు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ప్రాంగణంలో ఎమ్మెల్యే మొక్క నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఏరియా జీఎం రాజేశ్వర్ రెడ్ది, సింగరేణి అధికార ప్రతినిధి మారుతీ, సింగరేణి అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు.