Rural voters | గ్రామాల్లో వెల్లువెత్తిన చైతన్యం

Rural voters | గ్రామాల్లో వెల్లువెత్తిన చైతన్యం
మండలంలో 73.18 శాతం ఓటింగ్ నమోదు
Rural voters | భీంగల్ టౌన్ / రూరల్, ఆంధ్రప్రభ : ఎన్నికల పోలింగ్ పర్వంలో గ్రామీణ ఓటర్లు ఉత్సాహం కనబరిచారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజా సమాచారం ప్రకారం… మధ్యాహ్నం 1 గంట సమయానికే మొత్తం 73.18శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 37,453 మంది ఓటర్లకు గానూ, అప్పటికే 27,407 మంది తమ ఓటు వేశారు.
ఉత్సాహంగా ఓటేసిన మహిళలు…
పురుషుల కంటే మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడంలో ముందున్నారు. మధ్యాహ్నం 1గంట వరకు 16,620 మంది మహిళలు ఓటు వేయగా, 10,787 మంది పురుషులు ఓటేశారు. గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద పండుగ వాతావరణం కనిపించింది.
పెద్దమ్మ కాడి తండాటాప్… బడా భీంగల్ లాస్ట్…
గ్రామాల వారీగా పరిశీలిస్తే పోలింగ్ శాతంలో గణనీయమైన వ్యత్యాసాలు కనిపించాయి. అత్యధిక పోలింగ్ పెద్దమ్మ కాడి తండాలో 84.56 శాతం, అత్యల్పంగా బడా భీంగల్ గ్రామంలో 57.44 నమోదైంది. పోలింగ్ ప్రారంభమైన ఉదయం 9 గంటలకే ఓటర్లు చురుగ్గా పాల్గొనడం విశేషం.
- ఉదయం 9.00 గంటలకు: 24.92 శాతం
- ఉదయం 11.00 గంటలకు: 58.68 శాతం
- మధ్యాహ్నం 1.00 గంటలకు: 73.18 శాతం
మధ్యాహ్నం ఎండ తీవ్రత ఉన్నప్పటికీ, తండాల్లో ఓటర్లు ఉత్సాహంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిచెప్పింది.
