రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలో భూముల స్వాధీనం అంశం చుట్టూ ఉద్రిక్తత నెలకొంది. సర్వే నంబర్ 289లోని సుమారు 100 ఎకరాల భూమిపై ప్రభుత్వం కన్నేసింది. ఈ 100 ఎకరాల భూమి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమీపంలో ఉన్నందున, అధికారులు దీనిని ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలనే చర్యలకు పూనుకున్నారు.
ఈ క్రమంలో బుధవారం ఉదయం అధికారులు పెద్ద సంఖ్యలో పోలీసులతో అక్కడికి చేరుకుని భూమికి కంచె వేసే పనిని ప్రారంభించడానికి ప్రయత్నించారు.
బుల్డోజర్లు రంగంలోకి దిగి భూమిని చదును చేయడం ప్రారంభించగా, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని నిరసన తెలిపారు. “ఈ భూములు మా జీవనాధారంగా ఎన్నో ఏళ్లుగా సాగుచేస్తున్నాం, నోటీసులు లేకుండానే ఎందుకు తీసుకుంటున్నారు?” అంటూ రైతులు అధికారులపై ప్రశ్నలు గుప్పించారు.
వివాదానికి కేంద్రబిందువు – 289 – 73 సర్వేనెంబర్ లు !
ఈ భూములు అసలు ఏ సర్వే నెంబర్కు చెందుతాయన్నదే ప్రధాన వివాదంగా మారింది. రైతుల ప్రకారం, వారు సర్వే నెంబర్ 73లో భూములు సాగుచేస్తున్నారు. ఇదే విషయంపై గతంలో ప్రభుత్వం కూడా భూసేకరణ నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పుడు అధికారులు ఈ భూములు 289 సర్వే నెంబర్ పరిధిలోకి వస్తాయని చెబుతున్నారు.
అంతే కాక 73 సర్వేనెంబర్ అసలే లేదు అని అధికారులు ప్రకటించారు. దాంతో రైతులు “అయితే గతంలో మాకు ఎలా పన్నులు వసూలు చేశారు? ఎలా పట్టాలు ఇచ్చారు?” అంటూ ప్రశ్నించారు.
సబితా ఇంద్రారెడ్డి మద్దతు – “రైతులకు న్యాయం జరగాలి”
ఈ ఉద్రిక్తతల సమయంలో మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రైతులకు మద్దతుగా చేరారు. ఆమె మాట్లాడుతూ, ఎలాంటి నోటీసులు లేకుండా భూములు స్వాధీనం చేసుకోవడం అసంబద్ధం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల తరపున జిల్లా కలెక్టర్తో మాట్లాడిన ఆమె, పనులు తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆమె హెచ్చరికలు చేస్తూ, “రైతులకు న్యాయం జరగకపోతే, రైతులతో కలిసి బైఠాయిస్తాను” అని తెలిపారు.