రెగ్యులర్ స్థాప్ లలో బస్సులు ఆపాలని ప్రయాణికుల డిమాండ్
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల సందర్భంగా జిల్లాలో ఆర్టీసీ బస్సుల కొరత ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రెగ్యులర్ స్టాప్ లలో స్పెషల్ బస్సులు ఆపక పోవడంతో బస్సుల్లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
హన్మకొండ, భూపాలపల్లి, ఇతర ప్రాంతాలకు రెగ్యులర్ బస్సు సర్వీసులు తగ్గడంతో, వచ్చే బస్సులు సీటింగ్ కేపాసిటీ వరకు ప్రయాణికులతో వెళ్తున్నా స్టాప్ ల వద్ద ఆపకపోవడంతో రేగొండ, గాంధీనగర్ ఎక్స్ రోడ్, చెల్పూర్ భూపాలపల్లిలో కాటారం, చెన్నూర్, హన్మకొండ వెళ్ళేవారు బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. హన్మకొండ, నర్సంపేట తదితర ప్రాంతాల నుండి కాళేశ్వరంకు డైరెక్ట్ బస్సులు నడుస్తున్నా మధ్యలో స్టాప్ లేక ఆపకపోవడంతో ప్రయాణికులకు ఎండమావి కష్టాలతో ఎదురు చూపులు తప్పడం లేదు.
పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్న భూపాలపల్లి ఆర్టీసీ డీఎం ఇందు..
సరస్వతి పుష్కరాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో భూపాలపల్లి ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడుతుంది. బస్సుల్లేక చాలా సేపటి నుండి ఎదురుచూస్తున్న ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో నేరుగా డీఎం ఇందు బస్టాండ్ లో కౌంటర్ ఏర్పాటు చేసుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బస్సులను పిలిపించి ప్రయాణికులను పంపిస్తున్నారు. రెగ్యులర్ సర్వీసుల వలే ప్రతి బస్సులో అందరిని అనుమతించాలని ప్రయాణీకులు డిమాండ్ చేస్తున్నారు.