- ఐపీఎల్ 2025 ఫైనల్కు రంగం సిద్ధం
- రాజత్ వర్సెస్ శ్రేయస్…
- తొలి టైటిల్ కోసం ఏళ్ల నిరీక్షణ
- టాస్ అప్డేట్ !
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) సీజన్ ముగింపు ఘట్టానికి చేరుకుంది. ఈరోజు రాత్రి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం చరిత్రకు సాక్ష్యమివ్వబోతుంది. ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ను గెలవని రెండు జట్లు… రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – పంజాబ్ కింగ్స్, తమ తొలి ట్రోఫీ కోసం తలపడనున్నాయి.
టాస్ అప్డేట్
కాగా, తుది సమరంలో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టన్ శ్రేయస్ అయ్యార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆర్సీబీ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
తుది జట్లు
పంజాబ్ కింగ్స్ : ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, వైషాక్ విజయ్కుమార్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హాజిల్వుడ్.
సీజన్ జర్నీ:
ఆర్సీబీ ఇప్పటివరకు మూడు ఫైనల్స్లో పాల్గొన్నా, టైటిల్ గెలవలేకపోయింది. మరోవైపు పంజాబ్ జట్టు 2014 తర్వాత తొలిసారిగా ఫైనల్కి చేరింది. ఈ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు తమ తొలి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంటుంది. బెంగళూరు జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్, పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తమ జట్లను విజయపథంలో నడిపించేందుకు సిద్ధంగా ఉన్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు :
విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ తో సీజన్ను ఊపుమీద నడిపిన బెంగళూరు జట్టు.. లీగ్ దశలో 9 విజయాలను నమోదు చేసి రెండో స్థానంలో నిలిచింది. క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి నేరుగా ఫైనల్కు చేరింది. ఈ విజయంతో రాజత్ నాయకత్వంలో బెంగళూరు చరిత్ర సృష్టించేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది.
పంజాబ్ సూపర్ కింగ్స్ :
పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో అత్యంత స్థిరంగా ఆడి 9 విజయాలతో లీగ్ టేబుల్ టాపర్గా నిలిచింది. అయితే క్వాలిఫయర్ 1లో ఆర్సీబీ చేతిలో ఓటమి పాలైన పంజాబ్, క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్ను చిత్తుచేసి ఫైనల్ టికెట్ పొందింది. దీంతో శ్రేయస్ నాయకత్వం మరోసారి పరీక్షకు సిద్ధమైంది.
హెడ్టు టు హెడ్డు రికార్డ్ :
ఆర్సీబీ – పంజాబ్ మధ్య ఉన్న ముఖాముఖి పోటీ సంవత్సరాలుగా అత్యంత ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు రెండు జట్లు 36 మ్యాచ్లలో తలపడగా.. ఇరు జట్టూ 18 విజయాలతో సమంగా నిలిచాయి.ఇరు జట్లూ ఏ సమయంలోనూ వెనక్కి తగ్గని పోరాటస్ఫూర్తితో చెలరేగాయి. ఈ సీజన్లోనే ఈ ఇరు జట్టు మూడు సార్లు తలపడగా, అందులో బెంగళూరు రెండు విజయాలతో పైచేయి సాధించింది.
వాతావరణం ఎలా ఉంటుంది?
ఆహ్లాదకరమైన వాతావరణంలో మ్యాచ్కు ఆటంకం లేకుండా జరిగే అవకాశాలు ఎక్కువ. వర్షం అవకాశం తక్కువగా ఉంది (5%), అయినా ఏవైనా అలర్ట్లు ఉంటే స్టేడియంలో రిజర్వ్ డే పక్కా సిద్ధంగా ఉంది.
రికార్డులు:
ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్వుడ్ ఈ సీజన్లో 21 వికెట్లు తీసి కీలక బౌలర్గా నిలిచాడు.
విరాట్ కోహ్లీ 614 పరుగులతో ఆర్సీబీ బ్యాటింగ్లో అగ్రస్థానంలో ఉన్నాడు.
శ్రేయస్ అయ్యర్ మూడు వేర్వేరు జట్లను ఫైనల్స్ కు చేర్చిన మొదటి కెప్టెన్గా రికార్డు సృష్టించాడు.
ఈరోజు IPL ఫైనల్ వర్షంతో రద్దయితే ఏం జరుగుతుంది?
మ్యాచ్ కొద్దిసేపు ఆలస్యం అయినా.. ఫైనల్కు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఓవర్లు కోల్పోకుండా ఆటను పూర్తి చేయడానికి 120 నిమిషాల వరకు అవకాశం ఉంది. ఇందులో మ్యాచ్ను ఓవర్లను కోల్పోకుండా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అయితే వర్షం కొనసాగుతూ మ్యాచ్ను పూర్తిగా అడ్డుకుంటే, ఐపీఎల్ 2025 ఫైనల్ రిజర్వ్ డే అయిన జూన్ 4 (బుధవారం)కు వాయిదా పడుతుంది.
పరిస్థితులు ప్రతికూలంగా ఉండి, రిజర్వ్ డేలో కూడా ఆట సాధ్యం కాకపోతే, లీగ్ దశలో టేబుల్ టాప్లో నిలిచిన జట్టునే విజేతగా ప్రకటిస్తారు. ఈ సందర్భంలో, పంజాబ్ కింగ్స్ లీగ్ దశలో మొదటి స్థానంలో ఉండగా, ఆర్సీబీ రెండో స్థానంలో ఉంది. అందువల్ల మ్యాచ్ పూర్తిగా రద్దయితే, పంజాబ్ కింగ్స్నే IPL 2025 ఛాంపియన్స్గా ప్రకటించే అవకాశం ఉంది.