హైదరాబాద్ : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. కృష్ణా నదిలో తెలంగాణ నదీ జలాలకు సంబంధించి న్యాయమైన వాటాకు పట్టుబట్టాలని, ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని, ధాన్యానికి బోనస్ ఇవ్వాలని కోరారు. తెలంగాణ భవన్లో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏడాదిన్నరగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో తట్టెడు మన్ను ఎత్తని కాంగ్రెస్ ప్రభుత్వం, తమ హయాంలో 92శాతం పనులు పూర్తయిన ఈ ప్రాజెక్ట్ మరో రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పడం దేనికి నిదర్శనమని అన్నారు.. పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి పనులను చేపట్టకపోవడం మాతృద్రోహం కాదా..? అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పై కక్ష్యతోనే పాలమూరు పనుల్లో నత్తనడక..
ఉద్దండపూర్లో కొద్దిగా మినహా మిగిలిన నాలుగు పంప్ హౌస్లు, రిజర్వాయర్లు, సబ్ స్టేషన్లు, టన్నెళ్లు, సర్జ్ పూల్స్ బీఆర్ఎస్ హయాంలోనే పూర్తి చేశామని నిరంజన్ రెడ్డి అన్నారు. నార్లాపూర్లో వెట్ రన్ పూర్తి అయిన విషయాన్ని అయన గుర్తు చేశారు. ఈ ప్యాకేజీ 3లో 8 కిలోమీటర్ల కాలువ మాత్రమే మిగిలిపోయిందని అన్నారు… ఈ ప్రాజెక్టు కోసం 27 వేల ఎకరాలకు గాను వందెకరాలు మినహా మిగిలిన భూసేకరణ చేశామన్నారు.. బిఆర్ఎస్ పై కక్షతోనే కేవలం పాలమూరు ఫలితాలు త్వరగా అందకూడదనే ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు.. ఈ ప్రాజెక్ట్ మీద సమగ్ర సమీక్ష చేయకుండా ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నారు అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
వంద కోట్లతో నీళ్లందించే పథకానికి రూ.1800 కోట్ల ఖర్చా..
12.30 లక్షల ఎకరాలకు ఈ పథకం కింద సాగునీరు నల్లగొండ, పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు అందుతుంది. నల్లగొండకు డిండి లిఫ్ట్ ద్వారా దీని నుండి సాగునీరు అందుతుందన్నారు నిరంజన్ రెడ్డి. ఏదుల నుండి నీళ్లివ్వడం ఖర్చుతో కూడుకున్నది అని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాం.. దానికి బదులు తక్కువ ఖర్చుతో వట్టెం రిజర్వాయర్ నుండి అఫ్ టెక్ ద్వారా గ్రావిటీ కింద నీళ్లు తీసుకెళ్లవచ్చని ప్రభుత్వానికి సూచించాం. దీనికి రూ.80 నుండి రూ.100 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదుల నుండే నీళ్లు తీసుకెళ్లాలని రూ.1800 కోట్ల ఖర్చుకు సిద్దం అవుతుంది. దీనిలో రూ.1300 కోట్లు టెండర్లు కూడా పూర్తి చేశారు. రూ.80 కోట్లతో అయ్యే పనులను రూ.1800 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నిపుణుల కమిటీని వేయాలని ప్రభుత్వాన్ని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.
అప్పుడు జూరాల వట్టిపోవడం ఖాయం..
పాలమూరు పనులు పక్కన పెట్టి డిండి పనులను ఎందుకు హడావిడిగా చేపడుతున్నారని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే దానిని నీటి పారుదల శాఖా మంత్రి ఎందుకు సమీక్షించడం లేదు..? పాలమూరు – రంగారెడ్డిలో నారాయణ పేట, కొడంగల్కు గ్రావిటీతో సాగునీళ్లు ఇచ్చే టెండర్లు రద్దు చేసి కొడంగల్ ఎత్తిపోతల ఎందుకు చేపట్టారు. నదీజలాల పునఃపంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను ఈ నెల 7న ఫైనల్ చేసేందుకు కేంద్రం రాష్ట్రాలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ ఉత్తర్వులపై మేము అభ్యంతరం తెలిపాం.. ఈ నీటి వాటాలో తెలంగాణ వాటాను యధాతథంగా తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంటే తెలంగాణకు గొడ్డలి పెట్టు. దీనిమూలంగా ఆల్మట్టి ఎత్తు పెంచి 160 టీఎంసీలు నిలుపుకునేందుకు అవకాశం ఉంటుంది. దీంతో తెలంగాణకు నీళ్లు రావడం గగనంగా మారుతుంది. ఆల్మట్టిలో 10 టీఎంసీల నీళ్లు వదులు కోవడానికి కింది రాష్ట్రాలకు అవకాశం ఇచ్చింది.. అయితే ఆల్మట్టిలో అలా పెట్టుకోవడానికి ప్రాజెక్టు డిజైన్ సరిపోదు. అప్పుడు జూరాల వట్టిపోవడం ఖాయం అని నిరంజన్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్ట్ లపై కేంద్రం ఈ నెల 7న నిర్వహించే సమావేశంలో తెలంగాణ ప్రయోజనాల కోసం పట్టుబట్టాలని కోరారు.