- రెండు ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ లు సీజ్
నిజామాబాద్ (ఆంధ్రప్రభ) : నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప గ్రామంలో నకిలీ వైద్యులపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉక్కుపాదం మోపింది. అధికారుల తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తుల క్లినిక్లను సీజ్ చేశారు.
డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీ తన బృందంతో కలిసి ఆకస్మికంగా గ్రామంలోని ప్రగతి ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ను పరిశీలించారు. తనిఖీల్లో మహిళలకు గ్లూకోజ్ చుక్కలు వేసేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు గుర్తించబడ్డాయి. ఈ ప్రక్రియ నిబంధనలు ఉల్లంఘిస్తూ పరిధిని మించి వైద్యం చేస్తున్నట్లు స్పష్టమైంది.
ఇందుకు సంబంధించిన వ్యక్తి విట్టల్ సింగ్పై ఇప్పటికే జనవరి 25న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నకిలీ వైద్యుడిగా ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పటికీ, అతను ఇంకా వైద్య సేవలు కొనసాగిస్తుండటంపై డీఎంహెచ్వో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే క్లినిక్ను అధికారికంగా మూసివేశారు. సూర్ మహేష్ పేరుతో నడుస్తున్న క్లినిక్ ను సంబంధిత అధికారుల పర్యవేక్షణలో ఆ క్లినిక్ను కూడా సీజ్ చేశారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీ మాట్లాడుతూ, వైద్య అర్హతలు లేకుండా చికిత్స నిర్వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని, ఇటువంటి వ్యవహారాలను సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో జిల్లా వైద్య శాఖ అధికారులతో పాటు స్థానిక పోలీసులు కూడా పాల్గొన్నారు.